Tuesday, December 7, 2010

యధ్భావం తధ్భవతి

శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీతలో నా భక్తులు నన్నే విధముగా భావిస్తారొ నేను అదే విధంగా వారికి దర్శనమిచ్చి వారి సకల కొరికలను తొరుస్తానని ప్రవచించారు. కలియుగ దైవం, భక్తుల పాలిటి కల్పవృక్షం, సమర్ధ సద్గురువు అయిన శ్రీ సాయినాధులు తన భక్తులు తనను ఏ విధంగా భావించారో వారికి ఆదే రూపంలో దర్శనమిచ్చిన సంఘటనలు శ్రీ సాయి సచ్చరిత్రలో అనేకం కనిపిస్తాయి. మారుతి, వెంకటేశ్వరుడు, దుర్గాదేవి, నరసింహ స్వామి,దత్తాత్రేయుడు ఇలా ఎందరో భక్తులు వారు భావించిన విధంగా దర్సనమిచ్చిన వైనం అద్వితీయం, అపుర్వం, అసామాన్యం అని చెప్పక తప్పదు. అట్లే కలియుగం లో ఈ భువిపై అవతరించిన శ్రీపాద శ్రీ వల్లభులు,నరసింహ సరస్వతి,రమణ మహర్షి, లహరి మహాశయులు ఇత్యాది సద్గురువులు తమ భక్తులకు ఇటువంటి మహత్తర అనుభవాలను ప్రసాదించారు. దీనినే శాస్త్రం యద్భావం తద్భవతి అని ప్రభోదిస్తొంది అంటే భావం బట్టే ఫలితం.

మన మనసులో ఎటువంటి ఆలోచనలు ప్రవేశిస్తాయో ఫలితాలు అదే విధంగా వుంటాయి అనడానికి ఉదాహరణ ఈ క్రింది కధ :

ఒక లోభి అయిన సన్యాసి తన గురువు వద్ద ఉపదేశం తీసుకొని భగవంతుని కోసం తీవ్రంగా తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమై తన మనస్సులో మూడు సార్లు ఏమైనా కోరుకుంటే అది తప్పక నెరవేరుతుందని వరం ఇచ్చాడు.

వెంటనే ఆ సన్యాసి మహదానంద భరితుడై ఈ లోకంలోనే ఇప్పటి వరకు లేని విధంగా సకల సదుపాయాలు గల ఒక భవంతిని కావాలనుకున్నాడు. క్షణాలలో ఒక దివ్య భవంతి అక్కడ ప్రత్యక్షమయ్యింది. రెండు రోజులపాటు ఆ భవంతిలో సకల రాజ్య భోగాలు అనుభవించాక తనకు తోడుగా ఒక దేవ కన్య వుంటే ఈ సుఖాలను మరింత అద్భుతంగా, సంతృప్తి కరంగా అనుభవించవచ్చునని కోరుకున్నాడు. వెంటనే జగదేక సుందరి అయిన ఒక దేవ కన్య ప్రత్యక్షమయ్యింది. ఆమె చూడగానే తన జన్మ ధన్యమయ్యిందని భావించి ఆమెతో శృంగార కార్యకలాపలలో తేలిపోయాడు. రొజులు, వారాలు, నెలలుగా గడిచాయి. ఈ హడావిడిలో తనకు ఒకే కోరిక మాత్రం తీర్చుకోగలడన్న విషయం మరిచిపోయాడు ఆ సన్యాసి.
ఒక రోజు మధువు, మగువ మైకంలో వున్న అతడు " ఏ జన్మలోనో పుణ్యం చెసుకోబట్టి ఇంతటి అద్భుతమైన జీవితం అనుభవిస్తున్నాను. ఒక వేళ పొరపాటునో గ్రహపాటునో ఈ సిరి సంపదలన్నీ మాయమైపోయి నేను ఇంతకు ముందు కంటే బికారిని అయిపోయి తిండి కూడా లేక కుక్క చావు చస్తేనో ?" అని అనుకున్నాడు. వెంటనే దేవుడు ఇచ్చిన వరం ఫలితంగా అతను అనుభవించే సిరి సంపదలు మొత్తం మాయమైపోయి ఒక్కసారిగా బికారి అయిపోయాడు. అంతే కాక తన ఆలోచన ఫలితంగా తిండికి కూడా గడవని పరిస్థితి వచ్చి నిజంగానే దుర్భరమైన మరణం పొందాడు.

అన్ని ఆలోచనలకూ మన మనస్సే కేంద్ర బిందువు. మంచి ఆలోచనలను మానవుల అభివృద్ధికి ప్రాణవాయువు వంటివి.అవి మనలను సన్మార్గంలో నడిపిస్తాయి.చెడ్డ ఆలోచనలు తులసి వనంలో గంజాయి మొక్కల వంటివి. మానవాళిని అధమ : పాతాళానికి తొక్కివేస్తాయి. రెండవ ప్రపంచ యుద్దంలో ఒక దేశాధినేతకు కలిగిన ఒక చెడ్డ ఆలోచన అణుబాంబును జపాన్ లోని హోరొషిమా పై వేసి లక్షలది మంది మరణానికి కారణమయ్యింది. అణుబాంబు లోని అదే ఇంధనాన్ని మానవాళికి ఉపయోగపడేలా చేయాలన్న అబ్ధుల్ కలాం వంటి మహోన్నత వ్యక్తులకు కలిగిన ఒక మంచి ఆలోచనకు ప్రతిరూపం ఇప్పుడు కార్య రూపం దాలుస్తోంది.ఇక భవిష్యత్తులో మన దేసంలో ఇంధన కొరత వుండదని నిపుణులు భావిస్తున్నారు.

మనం ఈ సమాజానికి ఏది ఇస్తామో అదే తిరిగి మనకు లభిస్తుంది. ఇతరులకు దుఖం ఇస్తే దుఖం, ఆనందం ఇస్తే ఆనందం, సహాయం చెస్తే అదే సహాయం వెయ్యింతలై ఏదో ఒక రుపెణా మనకు లభిస్తుంది.మన ఆలోచనలే మన భవిష్యత్తుకు పునాది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అన్నది విజ్ఞుల ఉవాచ. మంచిని చెస్తే మనకు మంచే కలుగుతుంది. మంచిని చెయ్యాలంటే మంచి ఆలోచనల ఆవశ్యకత ఎంతైనా వుంది. ఒక మంచి ఆలోచన పరిధి ఎంతో గొప్పది. వైరస్ వలే త్వర త్వరగా ఇతరులకూ వ్యాపిస్తుంది. మంచి ఆలోచనలు తద్వారా మంచి పనుల వలన మనకు లభించే సుఖ సంతోషలు, శాంతి సౌభాగ్యాలను చూసి ఇతరులు కూడా స్పూర్తి తో అటువంటి మంచి పనులను చేయడానికి ఉద్యుక్తులౌతారు. సత్కర్మల వలన విశ్వశాంతి, సమాజ శ్రేయస్సు వృద్ధి చెందుతాయి. అప్పుడు ప్రపంచం ఒక నందన వనం అవుతుంది.

సర్వేజనా సుఖినోభవంతు
లోకాస్సమస్తా సుఖినోభవంతు

1 comment:

Unknown said...

very useful blog.
https://goo.gl/Yqzsxr
plz watch and subscribe our channel