Saturday, December 19, 2009

భగవద్దర్శనం

పూర్వం మందగిరి అరణ్య ప్రాంతం లో ఒక గురు కులం వుండేది. అక్కడికి దేశం నలుమూలలా నుండి ఎందరో విధ్యార్ధులు విద్యాభ్యాసం కోసం వస్తుండేవారు. ఆ గురుకులానికి అధిపతి చిదానంద మహర్షుల వారు. చిదానంద మహర్షి సకల వేద పారంగతుడు. సకల శాస్త్రాలను, పనిషత్తులను,పురాణేతిహాసాలను ఔపాసన పట్టిన దిట్ట. తన తప:శ్సక్తితో తన గురుకులానికి వచ్చే ఎందరికో ఎన్నో వ్యాధులను నయం చేసేవారు. తన శిష్యులను తన కంటే ఉత్తములుగా తీర్చి దిద్దాలని సదా తాపత్రయపడుతుండేవారు.

ఆ గురుకులంలో రామశాస్త్రి అనే బ్రాహ్మణ బాలుడు విద్యాభ్యాసం చేస్తుండేవాడు. రామశాస్త్రి స్వతాహాగా చాలా తెలివైన వాడు. ఏక సంధాగ్రహి. గురువు చెప్పిన అతి క్లిష్టమైన పాఠాలను ఠక్కున అర్ధం చేసుకొని గుర్తుంచుకొనడమే కాదు, అడిగినప్పుడల్లా వెంటనే తిరిగి అప్పజెప్పేవాడు. తాను నేర్చుకున్న పాఠాలలో సందేహాలు కలిగితే ఏ మాత్రం సంశయం లేకుండా గురువు గారి దగ్గరకు వెళ్ళి సందేహ నివృత్తి చేసుకునేవాడు. రామశాస్త్రి యొక్క బహుముఖ ప్రజ్ఞ కు,తెలివితేటలకు సాటి విద్యార్ధులే కాక చిదానంద మహర్షి సైతం ఆశ్చర్యపోతుండేవారు.

ఒక సారి రామశాస్త్రి మహర్షుల వారు చెప్పిన భగవంతుని సర్వ వ్యాపక తత్వం అనే పాఠాన్ని తిరిగి వల్లె వేస్తుండగా భగవంతుడు ఎలా వుంటాడు అనే సందేహం కలిగింది. వెంటనే ధ్యానం చేసుకుంటున్న మహర్షుల పాదాలకు నమస్కరించి తన సందేహాన్ని తెలియజేసాడు. "గురుదేవా ! మీరు భగవంతుడు ఈ సకల చరా చర సృష్టిలో చివరకు జడమైన పధార్ధాలలో కూడా అంతటా వ్యాపించి వుంటాడని తెలియజేసారు. అసలు ఆ పరమాత్ముని స్వరూపమేమిటి ? ఏ రూపంలో ఈ విశ్వమంతటా వ్యాపించి వున్నాడు ? ఆ భగవంతుని దర్శనం చేసుకోవాలని నాకు గాఢం గా వుంది"

శిష్యునికి వచ్చిన సందేహం విని మహర్షుల వారు ఎంతో సంతోషించి భగవంతుని సర్వ వ్యాపకత్వం గూర్చి మరింత విపులంగా తెలియజెసి , ఆఖరులో " ఆ భగవంతుని దర్శించాలన్న నీ కోరిక చాలా పవిత్రమైనది మరియు ఉన్నతమైనది.అయితే కేవలం కోరిక వుంటే సరిపోదు. ఆ సర్వేశ్వరుడిని దర్శించాలన్న ఆకాంక్ష తీవ్రం గా వుండాలి.అప్పుడే భవద్దర్శనం ప్రాప్తమౌతుంది" అని ఉద్భోదించారు.

"నాకు ఆ దేవుడిని దర్శించాలన్న కోరిక చాలా ఎక్కువగా వుంది గురుదేవా ! మీ తప:శ్శక్తితో ఎట్లాగైనా నాకు ఆ ప్రాప్తం కలుగజేయండి" అని ప్రార్ధించాడు రామశాస్త్రి.

శిష్యుని మాటలు విని చిన్నగా మందహాసం చెసి "తప్పకుండా నాయనా ! సమయం వచ్చినప్పుడు తప్పకుండా దర్శనం చేయిస్తాను" అని అన్నారు మహర్షుల వారు.

ఆ సమాధానంతో అప్పటికి సంతృప్తి చెందినా ప్రతీ రోజూ భగవంతుడు ఎలా వుంటాడా అని ఆలోచించసాగాడు రామశాస్త్రి. భగవంతుడు ఏ రూపంలో వుంటే ఈ విశ్వమంతటా వ్యాపించి వుండగలడు? ఆ రూపాన్ని ఒక్కసారి దర్శిస్తే గాని తన సంశయం తీరదని ధృఢంగా నిశ్చయించుకున్నాడు.అదే విషయాన్ని మహర్షుల వారిని పదే పదే అడగసాగాడు.

ఒకరోజు చిదానంద మహర్షుల వారు రామశాస్త్రిని తనతో పాటు సముద్ర స్నానానికి రమ్మన్నారు.అలాగేనని గురువుతో పాటు వెళ్ళాడు రామశాస్త్రి. ఇద్దరూ నడుమ లోతు నీటిలోకి దిగి స్నానం చెయ్యసాగారు. ఇంతలో మహర్షుల వారు రామశాస్త్రి పిలక పట్టుకొని హఠాత్తుగా నీళ్ళలోనికి ముంచేసారు.ఈ హఠాత్పరిణామానికి ఆశ్చర్యపోయిన రామసాస్త్రి భయాందోళనలతో "గురుదేవా ! నన్ను రక్షించండి. నేను చచ్చిపోతున్నాను,నాకు ఊపిరి ఆడడం లేదు" అంటూ బిగ్గరగా ఆర్తనాదం చేయసాగాడు.అంతే కాక ఒడ్డున పడిన చేపపిల్లలా కాళ్ళు,చేతులు గట్టిగా కొట్టుకోసాగాడు.గురువు గారు పట్టిన పట్టును విడువకపోయేసరికి ఇక తనకు ఈ భూమ్మీద నూకలు చెల్లినట్లేనని, తన అహంకారానికి గురువు గారి ఈ విధంగా శిక్షిస్తున్నారని నిర్ణయించుకున్నాడు రామ శాస్త్రి.

సరిగ్గా అప్పుడే శిష్యుని పిలక పట్టుకొని నీళ్ళ నుండి పైకి లాగారు మహర్షుల వారు. ఆ చర్యతో ఒకింత ఉపశమనం పొందాడు రామశాస్త్రి.

'నీళ్ళలో వుండేటప్పుడు నీకేమనిపించింది? దేని కోసం పరితపించావు? "ప్రశ్నించారు చిదానంద మహర్షి.
"గురుదేవా! నీళ్ళలో మునిగిపోయినప్పుడు ఊపిరి అందలేదు.మరణం తధ్యమని భావించాను.కాస్తంత ఊపిరి లభిస్తే చాలని భావించాను" వినయంగ చెప్పాడు రామశాస్త్రి.

"నువ్వు ఇంతకాలంగా అడుగుతున్న ప్రశ్నకు ఇదే సమాధానం"చెప్పారు చిదానంద మహర్షి. "నీటిలో మునిగిపోయినప్పుడు ఊపిరి కోసం,ప్రాణానికి రక్షణ కోసం ఎలా పరితపించావో అంతే ఆర్తితో భగవంతుని కోసం పరితపించినప్పుడు ఆ సర్వేశ్వేరుడు తప్పక తన దర్శన భాగ్యం కలుగజేస్తాడు.భగవద్దర్శనం కోసం కావల్సినంత కేవలం ప్రేమ, భక్తి మరియు తీవ్రమైన ఆకాంక్ష,ఐహికపరమైన కోరికలతో అనుక్షణం కొట్టుమిట్టాడే వారికి భగవద్దర్శనం అసాధ్యం. ఆ విధంగా కృషి చేసి నీ లక్ష్యాన్ని సాధించుకో."

గురుదేవుల మాటలకు రామశాస్త్రి ఎంతో సంతోషించి కళ్ళ నీళ్ళ పర్యంతమై పాదాభివందనం చేసాడు.

ఆత్మ విశ్వాసమే శ్రీరామ రక్ష

పూర్వం మగధ దేశం లో నివసించే రామశర్మ అనే బ్రాహ్మణుడు వర్తకం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆతనికి భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు. భార్యా చాలా అనుకూలవతి, సత్వ గుణ సంపన్నురాలు. ఫిల్లలను, భర్తనూ ఎంతో ప్రేమగా చూసుకుంటూ వుండేది. కోరికలను అదుపులూ వుంచుకుంటూ సంతృప్తి తో జీవి స్తుండడం వలన ఆందొళనలు, అశాంతి వారికి ఆమడ దూరం లో వుండేవి.అత్యాశకు పోకుండా కొద్దిపాటి లాభలతో వర్తకం చేస్తుండడం వలన రామ శర్మ యొక్క వ్యాపారం సాఫీగా సాగిపోతూ వుండేది. పైగా కల్తీ లేని సరుకులను తక్కువ ధరకు అమ్ముతాడన్న మంచి పేరు కూడా వచ్చింది.

రోజులన్నీ ఒకేలా వుంటే దానిని జీవితం అని ఎందుకు అంటారు? రామ శర్మ భార్యకు అనారోగ్యం వచ్చింది. దూర దేశం లో వైద్యం చేయించడం మొదలుపెట్టాడు. ఇద్దరు పిల్లలకు పెళ్ళిళ్ళి కూడా చేసేసాడు. వయో భారం వలన ఇదివరకటిలా వ్యాపారం చెయ్యలేకపోతున్నాడు. ఆదాయం మందగించింది, ఖర్చులు ఎక్కువయ్యాయి. పిల్లలు వాపారం నిమిత్తం దూర దేశాలకు వలస వెళ్ళిపోయి తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేసారు.జీవితం లో ఎదురైన ఈ కష్టాల పరంపరను తట్టుకోలేక తల్లడిల్లిపోయాడు.

ఆ సమయంలో వారి గ్రామానికి ఒక సాధు పుంగవుడు వచ్చారు. ఆయన సర్వసంగ పరిత్యాగి. సకల వేద పారంగతుడు. ఊరూరూ తిరిగుతూ అధ్యాత్మిక గోష్టి గావిస్తూ ప్రజలను సన్మార్గంలో నడిపించ యత్నించేవారు.ఆయన వద్దకు వళ్ళి పాదాలపై పడి తన కష్టాలను విన్నవించుకున్నాడు రామశర్మ.

ఆతని మాటలను విన్న ఆ సాధు పుంగవుడు చిరునవ్వుతో” నాయనా ! కష్టాలు, సుఖాల పరంపర ప్రతీ వారి జీవితం లో తప్పనిసరి. వాటిని ధైర్యం తో, ఆత్మ విశ్వాసం తో ఎదుర్కోవలే గాని పిరికితనంతో వాటి నుండి పారిపోకూడదు. పిరికి వానికి ఇహ పరములు రెండూ చెడుతాయి. ధర్మానికి మారుపేరైన శ్రీ రామ చంద్రునికి, మహలక్ష్మీ అవతారమైన సీతమ్మ తల్లికీ కష్టాలు తప్పలేదు కాదా! రాజ్య భోగాలు దూరమై పన్నెండేళ్ళూ వనవాసం చేసి పడరాని కష్టాలు పడ్డారు. సాక్షాత్తు శ్రీ కృష్ణుడు తోడున్నా పాండవులు ఎంతటి కష్టాలు పడ్డారో మనందరికి తెలుసు కదా! వారి కష్టాలతో పోలిస్తే నీకు వచ్చినవి ఎంతటివో ఒక్కసారి ఆలోచించు. జీవితాంతం సుఖాలు మాత్రమే వుండాలి కష్టాల నీలి నీడ మనపై పడకూడదని భావించడం అవివేకం. చేదు తిన్న తర్వాతే తీపి యొక్క తీయనత్వం అనుభవమగు అన్న రీతిన కష్టాలను చవి చూసినప్పుడే సౌఖాల లోని మాధుర్యం మనకు అర్ధమౌతుంది. ఆన్ని ద్వందాలనూ సమంగా స్వీకరించే ఓర్పు,నేర్పు మనం అలవరచుకోవాలి.

కష్టాలనేవి గురువు వంటివి. మనకు జీవిత సత్యాలను బోధించదానికి, ఓర్పు, సహనం, విశ్వాసం వంటి సద్గుణాలను నేర్పడానికే వస్తాయి. వాటిని చిరునవ్వుతో ఎదుర్కొని అధిగమించాలే కాని బెంబేలెత్తి పారిపోకూడదు” అని ఉద్భోదించారు.

అమృతతుల్యమైన ఆ మాటలకు రామశర్మకు జ్ఞానోదయం అయ్యింది.జారిపోయిన ఆత్మ విశ్వాసాన్ని మళ్ళీ నింపుకున్నాడు. ధైర్యంతో ముందుకు సాగి మళ్ళీ జీవితం లో ఉన్నత స్థాయిని సాధించాడు.

చీకటి వెలుగులు, అమావాశ్య పౌర్ణమి , రాత్రి పగలు వలె ద్వందాలు. ప్రతీవారి జీవితం లో ఈ చక్రభ్రమణం తప్పని సరి.కష్టాలు వచ్చినప్పుడు పరిస్థితులను, ఇతరులను నిందించకుండా భగవంతునిపై భారం వేసి ఆత్మ విశ్వాసంతో ఆ పరిస్థితి నుండి బయట పదే మార్గం ఆలోచించాలి.

సుఖాలలో మునిగి తేలుతున్నప్పుడు భగవంతుని విస్మరించరాదు. సదా భగవన్నామస్మరణ చేయడం, సత్కర్మలు ఆచరించడం, కరుణ, జాలి, క్షమలతో పరులను ప్రేమించడం, ఇతరులకు వీలైనంతగా సహాయం చేయడం, అన్నార్తులను ఆదుకోవడం వంటి సత్కార్యాలను చేస్తే భగవంతుడు సంతోషించి మానవులను భవిష్యత్తులో కష్టాల కడలిలో మునిగిపోకుండా కాపాడుతాడు. కామ, క్రోధాది అరిష్డ్వర్గములను లోబర్చుకొని సత్వ గుణ సంపన్నులమై శాంతియుత జీవనం సాగించుట అత్యావశ్యకం. ఇతరులను తమతో పోల్చుకొని తాము దురధృష్టవంతులమన్న నైరాశ్యాన్ని సత్వరం విడనాడాలి. ఈ సృష్టిలో జరిగే ప్రతీ సంఘటన ఈశ్వరేచ్చ ప్రకారమే జరుగుతుంది. సంపదలు కోల్పోతే తిరిగి సాధించుకోవచ్చు కానీ ఆత్మ విశ్వాసం, ధైర్యం కోల్పొతే మాత్రం తిరిగి సాధించుకోలేము.

Friday, December 18, 2009

ధర్మాచరణే శ్రేష్టం

ధర్మార్ధ, కామ,మోక్షములను పురుషార్ధములని మన వేదాలు నిర్వచించాయి. అంటే ఏన్నో వేల జన్మల అనంతరం లభించే ఈ అపురూపమైన మానవ జన్మ ఎత్తిన ప్రతీవారు తప్పక సాధించవలసిన విషయములివి అని అర్ధం. వీటిలో ఏ ఒక్కటి సాధించలెకపోయినా ఎత్తిన ఈ మానవ జన్మకు విలువ వుండదు.ఈ పురుషార్ధముల వరుస క్రమాన్ని పరిశీలిస్తే ధర్మం ప్రధమ స్థానం లో వుంది.దీనిని బట్టి ధర్మాచరణ మరియు ధర్మయుతమైన జీవనాన్ని కొనసాగించవల్సిన ఆవశ్యకతను మన వేదాలు నొక్కి వక్కాణించాయి.

ఐహిక విషయ వాంచలు, భోగ భాగ్యాలే కాక మైధునముల విషయములను కూడా ధర్మయుతంగానే మనం సాధించుకోవాలి , అనుభవించాలి. మనం వేసే ప్రతీ అడుగు, ప్రతి ఆలోచనా కూడా ధర్మానుకూలంగానే వుండాలి.ఇది సృష్టి నియమం. ఎంతటి మహా భక్తుడైనా వీటిని అధర్మయుతంగా సాధించాలని యత్నిస్తే అధోగతి పాలు కాక తప్పదు. ఇందుకు మన పురాణాలలో లెక్కకు మించిన తార్కాణాలు వున్నాయి.

రాక్షసరాజైన హిరణ్య కశిపుడు దేవతలను లొంగదిసుకోవడానికి బ్రహ్మ దేవుని గూర్చి అతి కఠోరమైన తపస్సు చేసాడు. మహర్షులకు సైతం సాధ్యం కాని రీతిన తపస్సు ఒనరించాడని మన పురాణాలు తెలియజెస్తున్నాయి. ఆయన తపస్సుకు సంతోషించి బ్రహ్మదేవుడు ఏదైనా వరం కోరుకోమని అడిగితే అజ్ఞానం, గర్వాహంకారములతో తల్లి కడుపులో నుండి పుట్టక,రాత్రి, పగలు కాక, మనిషి, జంతువు కాక నేలమీద, ఆకాశం లో కాక మరణించకుండునట్లు వరం పొందాడు. ఇది ఎంతటి అధర్మ యుతం ? సృష్టికి విరుద్ధం ? స్వార్ధానికి పరాకాష్ట. వరం పొందాక మరణమును జయించానన్న అహంకారంతో విర్రవీగి ఎన్నో వర్ణింప శక్యం కాని దుర్మార్గాలను చేసాడు.దేవతలను అనేక ఇ క్కట్ల పాలు చేసాడు. ఎందరో పర స్త్రీలను అమానుషంగా అధర్మయుతం గా అనుభవించాడు. ఫలితంగా అతని పాపం పండే నాటికి శ్రీ మహా విష్ణువు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపనార్ధం నారసింహావతారమును ఎత్తి హిరణ్య కశిపుని సంహరించాడు. హిరణ్య కశిపుని ఘోర తపస్సు అధర్మ యుత కోరికలకు , నడవడికకు బలైపోయింది.

పరమ శివ భక్తాగ్రేసరుడైన రావణ బ్రహ్మ తన తల్లి కొరిక తీర్చడం కొరకు కఠోర తపస్సు గావించి శివుని ఆత్మ లింగానే కానుకగా పొందాడు.మహా భక్తుడనన్న అహంకారంతో శివ పార్వతుల నివాసమైన కైలాస పర్వతమును పెకిలించి తన శిరస్సుపై మోసినవాడు. నిత్యం సప్త సముద్రాలను దాటి శివ ఆరాధన గావించి తిరిగి తన లంకాపురికి వచ్చేవరకు పచ్చి గంగైనా ముట్టని రావణ బ్రహ్మ తన అద్భుతమైన, అసామాన్యమైన దీక్ష ద్వారా దేవతల చేత మరణం పొందకుండునట్లు వరం పొందాడు, కేవలం అహంకారం చేతనే మానవ, జంతువులను విస్మరించాడు.

అపూర్వమైన వరములను పొందిన కారణంగా దేవతలపై దండెత్తి వారిని దారుణంగా హింసించాడు. ఎందరో పర స్త్రీలను చెరబట్టాడు, చివరకు శుర్పణఖ ప్రేరేపించిన కారణంగా మహా సాధ్వి, శ్రీ రామ చంద్రుని పట్టమహిషి అయిన సీతమ్మ తల్లినే కపట వంచనతో సాధువు రూపంలో వచ్చి అపహరించాడు. అధర్మయుతంగా ఇతరుల సంపదలను, స్త్రీలను అనుభవించిన కారణంగానే యుద్ధంలో తన వారినందరినీ పోగొట్టుకొని చివరకు శ్రీ రామచంద్రుని చేతిలో దిక్కు లేని చావు చచ్చాడు. ఎంతటి మహా భక్తుడు ? ధర్మ బద్ధం కాని నడవడిక వలన నాశనమైపోయాడు.

కలిపురుషుడి అంశలో జన్మించి అసమాన్య శూరులైన కౌరవులందరికీ అగ్రజుడైన ధుర్యోధనుడి జీవితం ఒకసారి పరిశీలించండి. అతనికి వున్న సిరి సంపదలు, బల పరాక్రమాలు అనిర్వచనీయం. అయితే అధర్మయుత నడవడికే అతని కొంప ముంచింది కౌరవ వంశాన్ని సమూలంగా నాశనం చెసింది. అసమాన్యమైన వైభవం కలిగిన ఆ రారాజు శకుని పన్నిన కుట్రలో పాల్గొని ధర్మానికి మారుపేరైన పాండవుల సిరి సంపదలన్నింటినీ అపహరించి వారిని అడవుల పాలు జేసాడు. మహా పతివ్రత అయిన ద్రౌపది యొక్క వస్త్రములను నిండు సభలో నలుగురి ఎదుట విప్పించి అతి ఘోరంగా అవమానించాడు.కాని చివరకు ధర్మమే జయించింది. అధర్మంగా సంపదలను, కామమును అనుభవించ యత్నించిన ఆ రారాజు తన వారినందరినీ కురుక్షేత్ర యుద్ధం లో కోల్పోయి దిక్కులేని చావు చచ్చాడు. దాన చక్రవర్తిగా చరిత్ర కెక్కిన కర్ణుడు కూడా అధర్మానికి బాసటగా నిలవడం వలనే అతి దారుణంగా చంపబడ్డాడు.

పై ఉదాహరణలను నిశితంగా పరిశీలిస్తే మనకు ఒక విషయం చాలా సుస్పష్టంగా అర్ధమౌతుంది.మిగితా మూడు అర్ధములైన అర్ధ, కామ మోక్షములు ధర్మయుతమైన నడవడిక ద్వారానే సాధించాలి, లేకపోతే వినాశనం తప్పదు.ధర్మం చాలా గొప్పది. ధర్మోతి రక్షితి రక్షిత: అన్నది ఆర్యోక్తి.ధర్మాన్ని ఆచరిస్తే అది మనలను తప్పక కాపాడుతుంది.ఇందులో కించిత్ సందేహం కూడా లేదు.కనుక మనమందరం కూడా ధర్మ మార్గంలోనే నడిచి ధర్మయుతమైన కోరికలను ధర్మ మార్గంలోనే తీర్చుకుందాం. ధర్మ మార్గంలోనే సంసార సుఖమును అనుభవిద్దాం మరియు ధర్మ మార్గంలోనే అర్ధం అంటే భోగ భాగ్యాలను సంపాదించుదాం , వాటిని ఆనందంతో అనుభవించుదాం.అధర్మ మార్గం చాలా వినాశకారి. మొదట్లో సౌఖ్యంగా వున్నా చివరకు వినాశనం తప్పదు. ధర్మ మార్గం తొలుత కష్టంగా వున్నా చివరకు సౌఖ్యాలను ప్రసాదిస్తుంది. మానవులను ముక్తికి అర్హులను చేస్తుంది.ఎన్ని యజ్ఞయ యాగాదులు చేసినా, కఠోర తపస్సులు సల్పినా ధర్మబద్ధమైన జీవనం చేయకపోతే అవన్నీ నిష్ప్రయోజనం.ధర్మమునకే అంతిమ విజయం, యుగ యుగాలుగా నిరూపింపబడిన సత్యం.


సర్వే జనా సుఖినోభవంతు
లోకా స్సమస్తా సుఖినోభవంతు

Wednesday, December 16, 2009

అగ్ని పరీక్ష

పూర్వం మగధ రాజ్యం లో వేద ధర్ముడనే సాధు పుంగవుడు వుండే వాడు.అతడు సకల వేద, శాస్త్ర పారంగతుడు.పురాణేతి ఇతిహాసాలను ఔపాసన పట్టిన దిట్ట. ఊరికి నాలుగు క్రోసుల దూరం లో ఒక నది ఒడ్డున చిన్న ఆశ్రమాన్ని నిర్మించుకొని జీవిస్తుండే వాడు. వేద ధర్ముడు మహా శివ భక్తుడు. వేకువ జామునే లేచి కాల కృత్యాలు తీర్చుకొని, స్వయంగా గోవు పాలు పితికి శివునికి అభిషాకం చెస్తేనే గాని పచ్చి గంగయినా ముట్టేవాడు కాదు. శివ భక్తియే కాక వేద ధర్ముడు గొప్ప మానవతా విలువలు మూర్థీభవించిన నిర్మల హృదయుడు. తన గుమ్మం లోనికి ఎవరొచ్చినా సరే, తనకు మిగిలిందా లెదా అని కూడా చూసుకోకుండా దన ధర్మలను చేస్తుండే వాడు.

ఒకసారి మహాశివుడు వేద ధర్ముని భక్తి, విశ్వాసాలను పరీక్షించ దలిచాడు. వేద ధర్ముని ఆశ్రమ ప్రాంతం లో తీవ్రమైన కరువు కాటకాదులను సృష్టించాడు. ఆ ప్రాంతం లోని ప్రజలు దేశం లోని ఇతర ప్రదేశాలకు వలస వెళ్ళిపోసాగారు. ఆశ్రమానికి వచ్చి కానుకలను సమర్పించే వారి సంఖ్య గననీయం గా తగ్గిపోయింది. సరైన పోషన లెక ఆవు కూడా కొద్ది రోజులకే మరణించింది. ఇన్ని ఇబ్బందులు ఏకకాలం లో ఎదురైనా సరే వేద ధర్ముడు తన శివారాధనను మానలేదు. పాలు లేకపోయినా, స్వచ్చమైన నదీ జలంతో నిత్యం మహాశివునికి అభిషేకం జరుపుతుండే వాడు. నారు పోసిన వాడు నీరు పొయ్యడా అనే చందాన తనను సృష్టించిన ఆ మహా శివుడే తన పోషణ భారం కూడా చూసుకుంటాడన్న ధృఢమైన విశ్వాసంతో వున్నాడు వేద ధర్ముడు.

ఇదిలా వుండగా ఒకసారి ఆశ్రమం లో బియ్యపు గింజలు పూర్తిగా నిండుకున్నాయి. తోటలో ఫలాల చెట్లు కూడా పూర్తిగా ఎందిపోయాయి. కటిక ఉపవాసం చేయవలిసి వచ్చింది.అయినా కేవలం మంచి నీరు త్రాగుతూ, శివ పంచాక్షరీ మంత్రం జపిస్తూ ప్రాణాలను నిలబెట్టుకుంటున్నాడు వేద ధర్ముడు.

నాలుగు రోజులు అలాగే గడిచాయి.తీవ్రమైన నీరసం ఆవహించినా శివ నామ జపం ఆపలేదు వేద ధర్ముడు.ఇంతలో ఒక భక్తుడు వచ్చి కొంచెం బియ్యం సమర్పించి వెళ్ళాడు. "శివార్పణ మస్తు" అని ఆ బియ్యాన్ని పులగంగా వండి శివునికి నైవేద్యం అర్పించాడు వేద ధర్ముడు. అతి పవిత్రమైన ఆ భుక్తాహారామ్మి స్వీకరించే తరుణం లో " తండ్రీ ధర్మం చెయ్యండి" అనే అతి దీనమైన పిలుపు ఆశ్రమ ప్రాంగణం లో వినిపించింది. వెంతనే బయటకు వెళ్ళీ చూస్తే ఒక ముదుసలి చేతిలో కర్రతో వణుకుతూ నిలబడి వున్నాడు. ముఖమంతా మడతలు పడి వుంది. శరీరం వ్యార్ధకంతో నిండి వుంది." స్వామీ ! వారం రోజుల నుండి తిండి లేదు.ఆకలితో చచ్చిపోతున్నాను. తినడానికేమైనా ఇచ్చి కాస్త పుణ్యం కట్టుకో.ఏ క్షణాన్నైన్నా నా ప్రాణం పోయేట్టు వుంది" అని అతి దీనం గా విలపించాడు ఆ ముసలి వ్యక్తి.

వేద ధర్ముని హృదయం ఆ మాటలకు పూర్తిగా ద్రవించింది. తన ఆకలి కంటే ఆ ముసలివాని ఆకలి మరింత తీవ్రమైనది. తాను అదృష్టం చేసుకోబట్టే ఆ ముసలి వాని ఆకలి తీర్చే భాగ్యం తనకు కలిగింది అనుకుంటూ ఆ ముసలిని "అతిధిదేవో భవ" అంటూ సాదరంగా ఆహ్వానించి, కాళ్ళు చేతులు కడిగి ఒక ఆసనంపై కూర్చోబెట్టి తాను వండిన అన్నం మొత్తమును ఆ ముసలి వానికి వడ్డించేసాడు. భోజనానంతరం త్రాగడానికి స్వచ్చమైన నీరు ఇచ్చి "మీరు అలసట తిరే వరకు ఇక్కదే విశ్రమించండి" అని అతనిని తన ఆశ్రమం లోపల పరుండబెట్టాడు.అంతే కాక తానే స్వయంగా అతనికి సపర్యలు చేసాడు. సాయంత్రానికి సేద తీరి తిరిగి శక్తి సంపాదించుకున్న ఆ ముదుసలి తనకు జరిగిన అథిధి సత్కారానికి ఎంతో ఆనందించి వేద ధర్ముని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు.తినడానికి ఏ మాత్రం భోజనం మిగలనందుకు వేద ధర్ముడు కించిత్ కూడా బాధ పడలేదు. పైగా వాకిట్లో నిలచిన అతిధికి తాను చేతనైనంతగా సత్కారం చేయగలిగినందుకు ఎంతో సంతోషించాడు. ప్రాణాలను నిలుపుకునేందుకు శివ పంచాక్షరీ మంత్ర జపమునే సాధనంగా ఎంచుకున్నాడు.

ఆ ముదుసలి రూపం లో వచ్చి తన భక్తుడిని పరీక్షించిన మహా శివుడు తన అగ్ని పరీక్షలో నెగ్గినందుకు వేద ధర్ముడిని ఆశీర్వదించాడు.జీవితపు అంతిమ ఘడియలలో అతనికి శాశ్వత శివ సాయుజ్యం ప్రసాదించాడు. భగవంతుడు పెట్టే వివిధ రకములైన పరీక్షలకు తట్టుకొని , ఆత్మ విశ్వాసం తో సహనం పట్టుదలలతో ఆ భగవంతుని పాదాలను చివరి వరకు విడువని వారే అధ్యాత్మిక జీవితలలో విజయం సాధిస్తారు అనడానికి వేద ధర్ముని జీవితమే ఒక నిదర్శనం.

Saturday, October 17, 2009

హాస్య వల్లరి - 5

1. “ఏవడే ఆ చుంచు మొహం గాడు ? మీసాలు, గెడ్డాలు కూడా లేకుండా కోతిలా వున్నాడు. వాడి వెధవ ముఖానికి సైటు కొట్టడం ఒకటి. చూడు మనల్నే ఎలా చూస్తున్నాడో ? “ ఈసడింపుగా అంది రేఖ.


“ ఓహ్, అతనా ! అతను నాకు అన్నయ్య వరస అవుతాడులే. బెంగుళూరులో సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. నెలకు లక్ష రూపాయలు జీతం.శెలవల కోసం నిన్నే ఈ ఊరొచ్చాడు” అసలు సంగతి చెప్పింది రాధ.


“ ఓహ్ గ్రేట్, ఎంత అందమైన పెర్సనాలిటీనో, షారూఖ్ ఖాన్ కూడా ఇతని ముందు దిగదుడుపే, కంప్లీట్ షేవింగ్ లో ఇంకా సూపెర్బ్ గా వున్నాడు.కాస్త పరిచయం చెయ్యవే బాబూ , నీకు పుణ్యం వుంటుంది” బ్రతిమిలాడసాగింది రేఖ.

2. “ఈ రోజు నుండి కాస్త ప్రశాంతం గా నిద్రపోదామనుకుంటున్నాను, మిమ్మల్ని వెంటనే వచ్చి కలవచ్చునా ?” ఫోన్ లో అడిగాడు రమేష్.


“ అలాగే తప్పకుండా రండి. కానీ నేను డాక్టర్ని కాదు. లాయర్ని” ఆశ్చర్యంగా చెప్పాడు వెంకట్రావు.


“ కరక్టే నండి. నాకు అర్జంటుగా డైవోర్స్ కావాలి” అసలు సంగతి చెప్పి ఫోన్ పెట్టేసాడు రమేష్.

3.” ప్రియా , నీ చెంపలు ఎంతో నున్నగా వున్నాయి,రోజుకు ఎన్ని సార్లు షేవింగ్ చేస్తావు?” మత్తుగా అడిగింది రజని.


“ ఒక ఇరవై సారులు చేస్తాను”


“ నీకేమైనా పిచ్చి గానీ పట్టిందా, రోజుకు ఇరవై సార్లు షేవింగా ?” ఆశ్చర్యంగా అడిగింది రజని.


“ అవును, నేను సెలూన్ లో పని చేస్తాను” అసలు సంగతి చెప్పాడు గణేశ్.

4.”అడ్డమైన బేవార్సు వెధవలతో స్నేహం చేయవద్దని మా నాన్నగారు చెప్పారు” గర్వంగా అన్నాడు రవి.

“ కరక్టే, అందుకే నేను నీతో ఈ రోజు నుండి స్నేహం మానెస్తున్నాను, బై, బై” అంటూ వెళ్ళిపోయాడు శ్రీను.

Monday, October 12, 2009

హాస్య వల్లరి - 4

1. “పాశ్చాత్య సంస్కృతిని ఒంట పట్టించుకున్న ఒక ఇరవై అయిదేళ్ళ అందాల భామ ఒక కంపెనీలో సెక్రెటరీ పోస్టుకు అప్లయి చేసింది. పేరు, వయస్సు,విద్యార్హత,జాతీయత వగైరా వివరాలను అప్లికేషనులో పూర్తిచేసాక “సెక్స్” అనే కాలం వద్ద ఆగిపోయింది. ఒకటి, రెండు నిమిషాలు సిగ్గుపడి చివరకు”వారానికి మూడు సార్లు మాత్రమే” అని రాసింది.

2. “ఏమిటండీ, మన పెళ్ళి రోజున నల్ల ఫ్యాంటు, నల్ల షర్టు వేసుకున్నారు?” ఆశ్చర్యంగా అడిగింది భార్య.

“జాతీయ విపతులు జరిగిన రోజున నల్ల బట్టలు ధరించడం మన రివాజు” అసలు సంగతి చెప్పాడు భర్త.

3. “ఏమిటండీ కారు అంత స్పీడుగా డ్రైవ్ చేస్తున్నారు? ఇంటికి వెళ్ళడానికి ఎవరో తరుముకొస్తునట్టు ఎందుకంత తొందర ?” అడిగింది భార్య.

“ అదేం కాదు! కారు బ్రేకులు ఫెయిలయ్యాయి. యాక్సిడెంట్ జరిగే లోపల ఇల్లు చేరుకుందామని స్పీడుగా పోనిస్తున్నాను” అసలు సంగతి చెప్పాడు భర్త,

4. “ నేను ఈ రోజు నుండి నీ దగ్గర ఏమీ దాచదలచుకోలేదు. ఫ్రాంక్ గా అన్నీ నిజాలనే చెప్పెస్తాను. నేను ముద్దు పెట్టుకున్న మొదటి అమ్మాయివి నువ్వు మాత్రం కాదు” శొభనం రోజున భార్యతో ఆవేశంగా చెప్పాడు రాజేష్.

“మీ ఫ్రాంక్ నెస్ నాకు నచ్చింది. నేనూ ఈ రోజు నుండి మీ దగ్గర అన్నీ నిజాలే చెబుతాను. మీకు అమ్మాయిలను ముద్దు పెట్టుకోవడం రాదు” తాపీగా చెప్పింది శొభన.

5. టీచర్:” టి తో మొదలయ్యే రెండు ఇంగ్లీష్ వారాల పేర్లు చెప్పరా రాము”
రాము : “ టుడే మరియు టుమారో”
టీచర్ “ ????”

౬. " నేనంటే నా భార్యకు ఈ మధ్య ఎంతో ఇష్టం పెరిగింది." గర్వంగా అన్నాడు రాజు"ఎలా చెప్పగలవు ?" అడిగాడు గోపి."అర్ధ రాత్రి ఒంటి గంటకు ఇంటికి వస్తున్నా అంట్లు తోమేందుకు వేడి నీళ్ళు పెట్టి ఇస్తుంది.బొగ్గుపొడికి బదులు నిర్మా ఇవ్వడం మొదలు పెట్టింది.బట్టలు ఉతికెందుకు సబ్బులో నానేసి రెడిగా వుంచుతుంది. అన్నం తినదానికి నేనెంత కష్టపడతానో అని ఏమీ మిగల్చకుండా అని మొత్తం తినేసి గిన్నెలు ఖాళీ చెసేస్తుంది" అసలు సంగతి చెప్పాడు రాజు

Sunday, October 11, 2009

హాస్య వల్లరి - 3

1.“కవిని పెళ్ళి చేసుకోవడం తప్పయిపోయిందే !” ఏడుస్తూ అంది రాధ.

“ ఏమయ్యింది ? ఆస్తి, అంతస్తులు, మంచి ఉద్యోగం వున్నాయని అతనిని కావాలనే పెళ్ళి చేసుకున్నావు గా!” ఆశ్చర్యంగా అడిగింది రేఖ.

“ప్రతి రోజూ రాత్రి తాను రాసిన ఆ దిక్కుమాలిన కవితలను వినిపిస్తూ నిద్ర లేకుండా చేస్తున్నాడు ఆ హింసరాజు ” అసలు సంగతి చెప్పింది కవి బాధితురాలైన రాధ.


2.“మీ అమ్మాయిని చూసి మొదట్లో వద్దనుకొని అంతలోనే వెంటనే ఎలా ఒప్పేసుకున్నారు పెళ్ళివారు ? “ ఆశ్చర్యంగా అడిగాడు నరసింహారావు.

“ కట్నం కింద రెండు బస్తాల కంది పప్పు అదనంగా ఇస్తానని కబురు పెట్టాను, ఎగిరి గంతేసి ఒప్పేసుకున్నారు” అసలు సంగతి చెప్పాడు పరమేశం.

3."ఎందుకే అయ్యగారికి జ్వరం వస్తే అంతగా బెంబేలు పడిపోతున్నావు ?” ఆశ్చర్యంగా అడిగింది ఆండాళ్ళు.

“ ఆయన మీకెంతో నాకూ అంతే కదమ్మా, అందుకే ఈ బెంగ” అసలు సంగతి చెప్పి నాలిక్కరుచుకుంది పనిమనిషి.

4.టెస్టులన్నీ చేసాక ఈ రాత్రి కంటే ఎక్కువ బ్రతకవని సుబ్బారావుకు డాక్టరు చెప్పేసాడు. విచారంగా ఇంటికి వచ్చి ఆదమరిచి నిద్రపోతున్న భార్య అనసూయను నిద్ర లేపి” ఏమేవ్! నేను ఈ రాత్రి కంటే ఎక్కువ బ్రతకనట. కనీసం ఈ రాత్రికి కబుర్లు చెప్పుకుందామే !. నా ఈ ఆఖరు కోరిక తీర్చవే” అని ప్రాధేయపడ్డాడు సుబ్బారావు.

“ ష్! ఊరుకొండి, వెధవ సంత.నేను ఉదయమే నిద్ర లేచి మహిళా మండలి మీటింగ్ కు వెళ్ళాలి. మీరైతే లేవనఖ్ఖరలేదు కదా!” అని పెద్దగా ఆవులించి తిరిగి దుప్పట్లోకి దూరింది అనసూయ.

5.” డాక్టర్, పిప్పి పన్ను బాగా నొప్పి చేసి, ఎన్ని మందులు వేసుకున్నా తగ్గడం లేదు. చాలా బిజీగా వుండడం వలన మీ దగ్గరకు రాలేకపోయాము. ఈ రోజు కూడా ఇంకొక అప్పాయింట్ మెంట్ వుంది. ఇంజెక్షను వగైరా అక్కరలేకుండానే త్వరగా పన్ను కాస్త పీకెయ్యండి” అఘిగాడు విశ్వేశ్వర రావు.

“అబ్బో, మీకు ధైర్యం చాలా ఎక్కువనుకుంటాను. ఏ పన్నో చూపించండి, ఒక్క నిమిషం లో లాగేస్తాను” పరికరాన్ని చేతిలోకి తీసుకొని అడిగాడు పన్నుల డాక్టర్.

“రజని, డాక్టర్ గారికి ఆ పిప్పి పన్ను కాస్త చూపించు” అని భార్యతో అని గది బయటకు జారుకున్నాడు విశ్వేశ్వర రావు.

6.”ఏమండీ అల్లుడు గారికి ఆ పని చేత కాదుట. అమ్మాయి డార్జిలింగ్ నుండి ఫోన్ చేసింది. అటువంటి వ్యక్తితో జీవితాంతం కాపురం చెయ్యలేనని, విడాకులు వెంటనే కావాలని అంటోంది” ఏడుస్తూ చెప్పింది అనసూయ.

“ ఇంతకీ ఆల్లుడు గారికి ఏ పని చేత కాదుట?” గాభరాగా అడిగాడు సుబ్బారావు.

“వంట చెయ్యడం” తాపీగా చెప్పింది అనసూయ.

7.అలసత్వానికి మారుపేరైన సుబ్బారావుకు తీవ్రం గా జబ్బు చేసింది. చాలా కాలం తర్వాత డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూపించుకున్నాడు. డాక్టర్ రాసి ఇచ్చిన టెస్టులను బద్ధకించి ఇంకొక రెండు నెలల తర్వాత చేయించుకొని ,ఇంకొక నెల తర్వాత వాటిని చూపించుకోవడానికి డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు.

రిపోర్టులను చూసిన తర్వాత డాక్తర్” సుబ్బారావు గారు, మీకొక బాడ్ న్యూస్.మీరు ఎక్కువ కాలం బతకరు” అని అన్నాడు.

ఆ మాటలు విన్న సుబ్బారావుకు తల దిమ్మెక్కిపోయింది. “ఏమిటి డాక్టర్ గారు మీరు చెప్పేది ? ఇంకా ఎంత కాలం నేను బతుకుతాను ?” అని అడుగగా ఆ డక్తర్ “పది” అని చెప్పాడు.

“ఏమిటి పది డాక్టర్ ? సంవత్సరాలా?నెలలా?వారాలా?సరిగ్గా చెప్పండి? గద్దించాడు సుబ్బారావు.

“తొమ్మిది, ఎనిమిది,ఏదు” లెఖ పెట్టడం ప్రారంభించాడు డాక్టర్.

8.ఒక పిచ్చాసుపత్రి క్లీనిక్ ముందు నుండి వెళ్తుండగా “పదమూడు, పదమూడు “ అంటూ పెద్దగా కేకలు వినబడ్దాయి రామారావుకు.

ఆతృత ఎక్కువై ఏమిటో కనుకుందామని ఆసుపత్రి ఆవరణ లోనికి వెళ్ళాడు. మెయిన్ డొరు వేసి వుంది. దానికి వున్న కన్నం నుండి లోనికి చూడ్డానికి ప్రయత్నించాడు. ఇంతలో అతని కళ్ళు బైర్లు కమ్మాయి. లోపల్నుంచి ఎవరో పుల్లతో అతని కళ్ళలో గట్టిగా పొడిచారు. “అమ్మా" అని బాధతో గట్టిగా అరిచి కన్నుని మూసుకోగా “పధ్నాలుగు, పధ్నాలుగు " అని మళ్ళీ కేకలు మొదలయ్యాయి.

నీతి : తనకు మాలిన ధర్మం వలదు.

Wednesday, October 7, 2009

హాస్యవల్లరి - 2

1. " మా ఆయన ఈ మధ్య బాగా మారిపోయారు తెలుసా ?" ఏడుస్తూ అంది రాధ.

" ఏమయ్యిందో చెప్పవే,నాకు తోచిన సలహా ఇస్తాను" అనునయం గా అంది అనురాధ.

" పెళ్ళి కాకముందు ప్రేమిస్తున్నానంటూ వెంటబడే రోజులలో నువ్వు లేకుండా బ్రతకలేనంటూ హుషారుగా పాత సినిమాలలో శోభన్ బాబులా సినిమా డైలాగులు చెప్పేవారు. ఈ మధ్య జీవితమే నరకం, జీవితం మూణ్ణాళ్ళ ముచ్చటే అంటూ మజ్ఞూ లా విషాదం గా పాటలు పాడుతున్నారు" ముక్కు చీదుతూ అసలు సంగతి చెప్పింది రాధ.

2. " ఏమిటండీ ఈ రోజు ఇంత త్వరగా ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసారు ?" మూడు గంటలకే ఇంటికి చేరుకున్న భర్త గణేశ్ ను అడిగింది భార్య కమల.

" ఫైలు తీసుకెళ్ళి ఆఫీసరు గారి ముందు పెడితే కోపం గా నాలుగు తిట్లు తిట్టీ గో టు హెల్ అన్నాడు. వెంటనే ఇంటికి అదే నా హెల్ కు వచ్చేసాను" అసలు సంగతి చెప్పాడు గణేశ్.

3. " నేనెంత కన్విన్స్ చేస్తున్నా మా పేరెంట్స్ మన పెళ్ళికి ఒప్పుకోవదం లేదు !" పెదవి విరుస్తూ అంది రేఖ.

" మరైతే ఏం చేద్దాం ? లేచి పోయి పెళ్ళి చేసుకుందామా ?" అడిగడు శేఖర్.

"అటువంటి నీచపు పనులు మా ఇంటా వంటా లేవు.ఇంక మనము బ్రతికి వేస్ట్ అనిపిస్తోంది నాకు"

" ఏం చేద్దాం"

" నువ్వు ఏ రైలు కిందో తల పెట్టేయి."

" నాకైతే ఒ కె, మరి నువ్వో?"

" నువ్వు లేని జీవితాన్ని ఊహించుకుంటూ,మన గతపు అనుభవాలను నెమరు వేసుకూంటూ ఏ గొట్టం గాడినో పెళ్ళి చేసుకొని బ్రతికేస్తాను " తాపీగా చెప్పింది రేఖ.

4. " నీ కోసం నేను ఏం చెయ్యడానికైనా సిద్ధం గా వున్నాను. ఏం చెయ్యమంటావో చెప్పు. సింగిల్ హాండ్ తో కళ్ళకు గంతలు కట్టుకొని బైక్ ను నడపమంటావా ?లేక నిన్ను ఎత్తుకొని ఎవరెస్ట్ శిఖరం ఎక్కమంటావా ?" ఆవేశం గా అడిగాడు మన్మధరావు.

" అవేం వద్దులే గాని, నేను రేపు ఫస్ట్ షో కి ఐమాక్స్ లో సుశాంత్ తో సినిమాకు వెళదామనుకుంటున్నాను. మా ఇద్దరికీ రెండు టికెట్లు తెచ్చి ఇవ్వు చాలు " అసలు సంగతి చెపింది భార్గవి.

5." నువ్వు ఇంకా రెండు రోజుల కంటే బ్రతకవు. నీ ఆఖరి రొజులలో ఎవరినైనా కలవాలనుకుంటున్నావా ? " అడిగాడు డాక్టర్ దైవాధీనం

" అవును. ఒక మంచి డాక్టర్ ను కలవాలనుకుంటున్నాను" అసలు సంగతి తాపీగా చెప్పాడు పరమేశం.

6. " ఒక సీరియల్ లో మీరు అమ్మాయి, అమ్మ, అమ్మమ్మ పాత్రలు వేస్తున్నారట కదా ! బహుశా తెలుగు టి వి పై త్రిపాత్రాభినయం ఇదే మొదటి సారి అనుకుంటున్నాను.కంగ్రాచులేషన్స్. ఒకే సీరియల్ లో మీరు ఒకేసారి మూడు పాత్రలు ఎలా వేయగలుగుతున్నారు ?" ఆసక్తిగా అడిగాడు సినిమా పత్రికా విలేఖరి.

" ఏముందీ, వెరీ సింపుల్. ఈ సీరియల్ వెయ్యి ఎపిసోడ్స్ పూర్తయ్యేసరికి అమ్మను అయిపోతాను. మరి వెయ్యి ఎపిసోడ్స్ కు ఏజ్ బార్ అయ్యి నాచురల్ గా అమ్మమ్మ పాత్రను పోషించేస్తాను" అసలు సంగతి చెప్పింది వర్ధమాన నటి శిరీష..

Tuesday, October 6, 2009

మాతృమూర్తికి తొలి వందనం

మాతృమూర్తికి తొలి వందనం


మాతృదేవోభవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిధి దేవోభవ అనే వేదోక్తిలో తల్లికే అగ్ర తాంబూలం ఇచ్చింది మన వేదం. హిందూ ధర్మంలోనే కాక అన్ని మతాలలో కూడా మాతృమూర్తికే తొలి వందనం అర్పించాలని ప్రవచించాయి. ప్రేమ, దయ,కరుణ,త్యాగాలలో మాతృమూర్తికి సాటి మరి ఎవరూ లేరు. ఆన్ని జీవుల హృదయాలలో అంతర్యామిగా కొలువు వుండే ఆ భగవంతుడు కళ్ళెదుట కనిపించే తన ప్రతిరూపం కూడా వుండాలన్న ఆలోచనతో మాతృమూర్తిని మనకు అందించాడు. అందుకే కనిపించని ఆ దైవానికి సజీవ ప్రతిరూపం “అమ్మ”. ఆ పేరులోనే ఎంత కమ్మదనం వుందో వర్ణింప శక్యం కాదు.

భార్యా భర్తల పవిత్ర సృష్టి కార్యం తర్వాత జీవుడు మాతృ గర్భంలో ప్రాణం పోసుకుంటాడు. నాటి నుండి అనుక్షణం పెరగడానికి అనువైన వాతావరణం తల్లి గర్భంలో సహజంగా రూపుదిద్దుకుంటుంది. తల్లి గర్భమే ఆ జీవునికి ప్రపంచం. తొమ్మిది మాసాల పాటు తల్లి ఆ శిశువును ఎంతో సంతోషంతో మోస్తుంది. శిశువు ఆరోగ్యంగా జన్మించాలని ఇష్టం వున్నా లేకున్నా ఎక్కువ మరియు అయిష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తుంది. మృత్యు సమానమైన ప్రసవ వేదనను ఎంతో సంతోషంతో భరిస్తుంది. ఛివరకు మరణానికి కూడా సిద్ధమై శిశువుకు ప్రాణం పోస్తుంది. అందుకే ప్రసవం అనేది అమ్మకు పునర్జన్మ అని అంటారు.ఆ క్షణం నుండి శిశువు సంరక్షణలో సర్వం మరిచిపోతుంది. తాను కన్నీళ్ళు ద్రిగమింగుకొని అమృతం వంటి స్తన్యాన్ని బిడ్డకు అందిస్తుంది. నిద్రాహారాలను మాని పిల్లల సంరక్షణే జీవితాశయంగా జీవించే అమ్మ ప్రేమను కొలిచే పరికరం ఏదీ లేదు.అమ్మ పవిత్ర ప్రేమకు,దయకు సాటి వేరొకటి లేదు. అందుకే భగవంతుడు తాను అమ్మ తర్వాతే పూజ్యనీయుడనని స్పష్టంగా చెప్పాడు.

బిడ్డ ఎదుగుతుంటే శ్వేతపత్రం వంటి మనసుపై ప్రపంచ జ్ఞానాన్ని ముద్రించే గురుతర బాధ్యతను మాతృమూర్తి స్వీకరిస్తుంది. అందుకే తల్లికే తొలి వందనం. తల్లియే తొలి గురువు. బిడ్డ మాటలు వచ్చాక పలికే తొలి పలుకు “అమ్మ”. పుట్టిన నాటి నుండి పాలతో పాటు విషయ పరిజ్ఞానాన్ని,లోక జ్ఞానాన్ని పంచి ఇస్తుంది.అందుకే పిల్లలందరూ ప్రపంచాన్ని తల్లి ద్వారా చూస్తారని అంటారు. తల్లి చీర కొంగు పట్టుకొని తొలి అడుగు వేస్తాడు బిడ్డ. తల్లి ప్రక్కనే వుంటే ఈ ప్రపంచాన్నే జయించగలమన్న ఆత్మ స్థైర్యం వారిలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.ఏది తప్పో – ఏది ఒప్పో కూడా తల్లి ద్వారానే నేర్చుకుంటాడు. అందుకే మహాత్మా గాంధీజి, చత్రపతి శివాజీ, స్వామి వివేకానంద వంటి మహనీయులందరికీ తల్లియే స్పూర్తి ప్రదాత అయ్యిందని వారి చరిత్రలు చెబుతున్నాయి.శిరిడీ సాయి కూడా ఒక భక్తునితో “తల్లిని జాగ్రత్తగా చూసుకున్న తర్వాతే తన దర్శనానికి రమ్మని, తల్లి రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలతో సమానం” అని తల్లి గొప్పదనం గురించి అద్భుతంగా చెప్పారు. ఆదిశంకరులు సన్యాసం స్వీకరించిన పిదప కూడా తల్లికి స్వయంగా దహన సంస్కారాలను చేసి మాతృఋణాన్ని తీర్చుకోవల్సిన ఆవశ్యకత గూర్చి తెలియజేసారు.

ఆమ్మను సేవించడం,మంచి చెడులు స్వయంగా చూసుకోవడం భగవంతుని ఆరాధన కంటే మిక్కిలి శ్రేష్టం. కానీ నేటి సమాజంలో తల్లిని దుర్భాషలాడుతూ,వారి యోగ క్షేమాలను విస్మరించి ఆశాశ్వతమైన భోగ భాగ్యాల వెంట పరుగులు తీసే విధ్యాధికులెందరో మనకు కనబడుతున్నారు.పెళ్ళి కాగానే తల్లిని అశ్రద్ధ చేయడం ప్రారంభమవుతోంది. వేరు పడిపోవడం ఆఖరుకు వారి వృధ్యాప్యంలో అనాధల వలే అనాధ శరణాలయాలలో చేర్పించడం జరుగుతోంది. తల్లిని విస్మరించడం, దుర్భాషలాడడం నిష్కృతి లేని మహా పాపం.తల్లిని తృణీకరించి తదనంతరం చేసే పుణ్య కార్యాలకు ఫలితం అతి స్వల్పం.ముందు ముందు అతి హీన జన్మలు తప్పవు. కడుపులో వుండగా కాలితో తంతూ, పెరుగుతూ వుండగా గుండెల మీద తంతూ వున్నా అమ్మ ఎంతో సంతోషంగా భరిస్తుంది. పెద్దయ్యాక హృదయంపై తన్ని వారిని దుఖానికి గురిచేసినా పిల్లల పట్ల అమ్మకు ప్రేమ లవలేశమైనా తగ్గదు. ఎన్ని దాన ధర్మాలు,తపస్సులు,యజ్జ్ఞ యాగాదులను చేసినా తల్లి నింద వలన చుట్టుకునే పాపాలకు నిష్కృతి,పరిహారం కలుగవు. వృధాప్యంలో అండ దండగా నిలిచి, కంటికి రెప్పలా కాపాడుతూ తుది శ్వాస వరకు సంతోషంగా వుంచడం మనిషి జన్మ ఎత్తినందుకు మన కనీస కర్తవ్యం.

సర్వం శ్రీ శిరిడీ సాయినాధ పాదారవిందార్పణ మస్తు.

Monday, October 5, 2009

హాస్యవల్లరి-1

1.“నర్సమ్మా ! పోస్ట్ మార్టం లో ప్రాక్టికల్స్ కోసం నాలుగు బాడీలను రేపు పన్నెండింటి కల్లా సప్లయి చేస్తామని ఆ మెడికల్ కాలేజీ వాళ్ళకు ఫోన్ చేసి చెప్పు” అన్నాడు డాక్టర్ దైవాధీనం

“అదెలా సాధ్యం సార్ ?” అడిగింది నర్స్.

“ రేపు ఉదయం మనకు నాలుగు ఆపరేషన్లు వున్నాయి కదా ! మధ్యాహ్నం కల్లా ఆ బాడీలను వాళ్ళకు ఇచ్చెయ్యవచ్చు” అసలు సంగతి చెప్పాడు డాక్టర్.


2." ఆడవాళ్ళ దగ్గర ఆచి తూచి మాట్లాడాలిరా !"


“ ఏమయ్యింది ?”


“ ఆ మధ్య కోపంలో నువ్వు చాలా అందంగా వుంటావని మా ఆవిడతో జోక్ చేసా! అప్పటి నుండి ఇరవై నాలుగు గంటలూ కోపంగా వుంటోంది. ఆ ముఖం చూడలేక చస్తున్నా”

3." ఈ సబ్బు వాడితే మురికి పోయి శుభ్రం గా అవుతుందని చెప్పావు. ఎంత అరగదీసినా ఈ షర్టు కున్న మురికి పోలేదు చూడు” కోపంగా షర్టును విసిరి కొట్టి అరిచాడు సుబ్బారావు.


“ ఎక్కువగా అరవకండి సార్ బి పి పెరిగి పోగలదు. నేనన్నది మీరు సరిగ్గా అర్ధం చేసుకోలేదు ! మురికి షర్టుకు పోతుందని ఎప్పుడు చెప్పాను ? ఈ సబ్బును చూడండి, ఎలా తళ తళ లాడుతుందో ?” తాపీగా అసలు సంగతి చెప్పాడు షాపు వాడు.

4.“ఏమిట్రా వాంతులకు విరేచనాలకు అన్నేసి బిళ్ళలు కొనుక్కెళుతున్నావు ? ఇంట్లో ఎవరికి ఏమయ్యింది ? అడిగాడు వెంకట్రావు.


“ ఎవరికీ ఏమీ అవకూడదనే వీటిని తీసుకెళ్ళుతున్నాను. నిన్నటి నుండి మా ఆవిడ కవితలు రాసి మాకు వినిపించడం మొదలెట్టింది. కాస్త ముందు జాగ్రత్త అవసరం కదా” అసలు సంగతి వివరించాడు నాగేశ్వరరావు.


5.“ డాక్టరు గారు. ఒళ్ళంతా నొప్పులుగా వుంది, అప్పాయింట్ మెంటు తీసుకోలేదు, కాస్త పరీక్ష చెయ్యరా ?” అందరినీ తోసుకొని గదిలోకి వచ్చి అడిగింది ఇరవై ఏళ్ళ రేఖ.


“ ఓకె, కాస్త బట్టలు వదులు చేసి ఆ టేబిల్ మీద పడుకొండి” చెప్పాడు విజయ్ రేఖ అందాన్ని కళ్ళతోనే జుర్రుకుంటూ.


“ నొప్పులు నాకు కాదు సార్, మా అమ్మగారికి”


“ సారి. ఇప్పుడు అప్పాయింట్ మెంట్ ఇవ్వడం కుదరదు. సాయంత్రం తీసుకు రండి” చికాకుగా అన్నాడు విజయ్.

Saturday, July 18, 2009

మోక్ష సాధనే ధ్యేయం

వేదాలలో నిర్వచించబడిన ధర్మార్ధ, కామ, మోక్షాలనే చతుర్విధ పురుషార్ధాలలో మోక్షానికే అత్యంత విలువ వుంది.అందుకే సనాతన మహర్షులు అనునిత్యం జపం, తపస్సు ఇత్యాది కార్యక్రమాలలో మునిగి మోక్ష సాధనే అంతిమ ధేయం గా కృషి చేస్తుంటారు. మోక్షం పొందడం అంటే ఈ జనన,మరణ చక్ర భ్రమణం నుండి విడిపడి ఆ భగవంతుని పాదాలకు చేరుకోవడమే ! ఆ భగవంతుని సన్నిధి లోనే శాశ్వత ఆనందం వుంది. అక్కడ ఎటువంటి చీకు, చింత, ప్రయాసలు, ఆందోళనలు, కష్ట సుఖాలు వుండవు. ఏదో సాధించాలన్న తపన, కోరికల చింతన అసలే మాత్రం వుండవు. ఉన్నదంతా ఆనందమే ! భగవంతుని సన్నిధిలో వున్నది శుద్ధ, ఘన చైతన్య స్వరూపం, నిత్యం,సత్యం అయిన ఆనందం మాత్రమే ! అయితే మోక్ష సాధన అనుకున్నంత సులభం కాదు. ఎన్నో జన్మలలో ముముక్షువు వలే తీవ్రమైన సాధన చేస్తే గాని సాధ్యం కాదు.

ఈ కలియుగం లో మాయా ప్రభావం లో పడి మానవుడు ఇంద్రియ లాలసుడు అయ్యాడు. అశాశ్వతమైన భోగ భాగ్యాల వెంట అవిశ్రాంతం గా పరుగులు తీయడం, అరిషడ్వర్గాలకు లోబడిపోయి తన నిజమైన ఉనికిని మర్చిపోయి పశువుల వలె ప్రవర్తించడం చేస్తున్నాడు. తత్ఫలితం గా అశాంతికి, అలజడులకు లోనవుతున్నాడు. సంతృప్తి అనేది లవలేశమైనా కానరావడం లేదు. భగవంతుని తోనే క్రయ విక్రయాలను ప్రారంభించాడు.దేవాలయానికి వెళ్ళడం అంటే కోరికల మూటతో వెళ్ళి యాంత్రికం గా ప్రార్ధనలు చేయడం గా మారింది. భూత దయ,సర్వ జీవ సమానత్వం, సర్వ మానవ సౌభ్రాతృత్వం అనేవి మచ్చుకైనా కానరావడం లేదు.జీవితమనే రంగ స్థలం పై వివిధ కాలాలలో విభిన్న పాత్రలను పోషించమని తద్వారా మోక్ష సాధనకు కృషి చేయమని భగవంతుడు అతి విలువైన ఈ మానవ జన్మను మనకు ప్రసాదిస్తే అవసరానికి మించినటించి పాపాలను మూట కట్టుకుంటున్నాడు. వాటిని ఇక్కడే అనుభవించి దు:ఖానికి లోనవుతున్నాడు. తిరిగి మరొక జన్మకు పునాది వేసుకుంటున్నాడు. చేసిన చిన్న మంచి పనికి ఆ జగన్నాటక సూత్రధారి నుండి గొప్ప బహుమానం రావాలని కోరుకోవడం మరొక వింత.ప్రతీ జన్మలో పాప, పుణ్యాల బ్యాలెన్స్ షీట్ లో పాపాలే చివరకు ఎక్కువగా మిగలడం, వాటిని అనుభవించేందుకు తిరిగి మరొక జన్మ ఎత్తి అందులోనూ క్రితం జన్మ యొక్క పాపాన్ని అనుభవిస్తునే మరిన్ని పాపలను ప్రోగు చేసుకోవడం - ఆ నికర పాపమంతా తిరిగి ఇంకొక జన్మకు బదిలీ కావడం - ఇలా చూస్తే మానవ జన్మలన్నీ చివరకు అనుభవించవల్సిన పాపలతోనే మిగిలి వుంటాయి. ఇక మోక్షం లభించేది ఎప్పుడు ?

కర్మ సిద్ధాంతం ఎంతో శక్తివంతమైనది.చేసిన కర్మలకు ఫలితం అనుభవించక తప్పదు. నాటిన విత్తనల పంటే మనం తినాల్సి వస్తుంది. మోసం చేస్తే మోసగించబడక తప్పదు.అధర్మం గా సంపాదించిన ప్రతీ పైసాను తిరిగి కక్కవలసిందే !అందుకే ఈ క్షణం నుందే మన ఆలోచనా విధానం మారాలి .మోక్షం పొందడమే మన ఏకైక లక్ష్యం కావాలి. నిత్యం భగవన్నామస్మరణ, జపం, తపస్సు, ధ్యానం, యోగాభ్యాసం, మృదుభాషణం, సద్గంధ పఠనం, సత్సంగం లో పాల్గొనుట, సాత్విక ఆహార స్వీకరణ, కోరికల ఉధృతిని తగ్గించుకొనుట, అనిత్యమైన భోగ భాగ్యల పట్ల ఆసక్తి తగ్గించుకొని శాశ్వతమైన పుణ్య సముపార్జన కోసం కృషి చేయడం,సాధు సత్పురుషుల దర్శనం,సజ్జన సాంగత్యం, భూత దయ పెంపొందించుకొనుట,శక్తికి మేర ధాన ధర్మములనాచరించడం,ఇత్యాది మంచి కార్యాలను చేపట్టాలి. జగత్తనే ఈ నాటక రంగం లో నటించి అలసి సొలసి పోయాను.ఇకనైనా కైవల్యం ప్రసాదించు స్వామీ అన్నదే మన నిత్య ప్రార్ధన కావాలి.నీ పాదాల చెంతనే నాకు లభించును ఆనందం. అనుక్షణం నీ పద సేవలోనే వుండి నన్ను తరించనీయవయ్యా స్వామీ ! అని ప్రార్ధిస్తూ, ఓర్పు, సహనం తో వేచి వుంటే కరుణామయుడు,దయాపూరిత హృదయుడు, అయిన ఆ స్వామి తప్పక కరుణిస్తాడు. పంజరం లో బంధించిన చిలుకను స్వేచ్చా లోకానికి వదిలిపెడితే ఏ విధమైన ఆనందం అనుభవిస్తుందో , శరీరం లో బంధించిన ఈ ఆత్మకు మోక్షం పేరిట విముక్తి లభిస్తే ఎల్లలు లేని ఆనందాన్ని అనుభవించి , ఆ భగవంతుని పాదాల చెంత వాలుతుంది.

సర్వం శ్రీ శిరిడీ సాయినాధార్పణ మస్తు

Wednesday, July 15, 2009

యాంత్రికత ను విడనాడాలి

సనాతన మహర్షులు తమ అమోఘమైన తప: శక్తి వలన ఆలోచనా స్థాయిని ఊర్ధ్వ కేంద్రాలకు అభివృద్ధి చేసుకొని సర్వజ్ఞులై, సర్వ సక్తిమంతులై చరించారు. భూత, వర్తమాన కాలం లతో పాటు భవిష్యత్ లో సంభవించు సంఘటనలను సైతం చూడగలిగే అద్భుతమైన దివ్య ధృష్టి వారికి వుండేది. కాలక్రమేణా కలిప్రభావం వలన అధర్మం పెచ్చు పెరిగి, మాయ మోహావేశాలు మానవాళిని తీవ్రం గా లోబరుచుకొని వారిని ఇంద్రియ లాలసులను చేసింది. ధనార్జనే ప్రధమ కర్తవ్యం గా సాగే జీవితం లో సాధన, అనుష్టానం కుంటుపడ్డాయి. ధర్మం నాలుగు పాదాల నుండి ఒక పాదం మీద నడువసాగింది. తత్ఫలితం గా మానవులు దిగువ స్థాయి శక్తి కేంద్రాల నుంది ఆలోచించసాగారు. ఆనందం,సుఖ శాంతుల స్థానే అలజడి, దు:ఖం, మనో వైకల్యం, అసూయా ద్వేషాలు మానవ జీవితం లో ప్రవేశించాయి. అనుక్షణం భావోద్వేగాలతో సహవాసం చేస్తున్నారు. గౌతమ బుద్ధుడు పుట్టిన ఈ పవిత్ర భారతావనిలో హింస విశృంఖలం గా రాజ్యమేలుతోంది.

మానవాళిని ఇటీవలి కాలం లో పట్టి పీడిస్తున్న మరొక సమస్య యాంత్రికత. తన సహజత్వానికి ముసుగు వేసుకొని జీవిస్తున్న మానవుడు సంకుచిత భావాలతో యాంత్రికం గా జీవించడం అలవాటు చేసుకున్నాడు. పున్నమి వెన్నెలను,ఆకాశం లో మిల మిల మెరిసే నక్షత్రాలను, మంచు బిందువులను, అందం గా అరవిరిసే గులాబీలను, సువాసన లందించే మల్లె మొగ్గలను, చిట్టి చిన్నారుల నవ్వులను చూసి మనస్పూర్తిగా స్పందించే హృదయం గల మానవులు నేడు లక్షల్లో ఒకరు కూడా కనిపించడం లేదు. కళ్ళెం లేని గుర్రాల వలె పరుగులు తీస్తున్న కోరికలను తీర్చుకునే క్రమం లో వేగవంతమైన జీవితాన్ని గడపడం అలవాటు చేసుకున్న మానవుడు మర బొమ్మల వలే అధ్వాహ్నం గా జీవిస్తున్నాడు. జీవితపు మకరందాన్ని ఆస్వాదించడం మరిచిపోయాడు. మనిషి అనుభవిస్తున్న కష్ట, నష్టాలకు, అశాంతికి,యాంత్రికతే ముఖ్య కారణమని మనో వైజ్ఞనికులందరూ స్పష్టం చేస్తున్నారు.

చీమను చూసి వెంటనే స్పందించే భావుకత కల్గిన మహా కవులు పుట్టిన దేశం మనది. క్రమం గా రోబోలతో నిండిపోవడం శోచనీయం.మనిషి ఆలోచనా స్థాయి కూడా అధమపు శక్తి కేంద్రాలకు దిగజారిపోయింది. ప్రస్తుత పరిస్థితులలో ఉన్నత శక్తి కేంద్రాల నుండి ఆలోచించగలగాలంటే కొన్ని జన్మలు పట్టవచ్చు. సూర్యోదయం ఒకప్పుడు రమణీయ ధృశ్యం, ఒక కొత్త జీవితానికి నాందీ వాక్యం. ఎన్నో క్రొత్త ఆశలతో, ఆశయాలతో వచ్చే రోజు నేడు తమ నిద్రకు ఆటంకం గా భావిస్తున్నారు.ఒకప్పుడు నిషేధింపబడిన ఆహార పధార్ధాలను నేడు వివిధ పేరులతో అందంగా ప్యాక్ చేసి ఇస్తే రుచికరంగా అస్వాదిస్తున్నారు.భగవంతుడు సృష్టించిన ఈ అద్భుతమైన ప్రపంచాన్ని చూసి ఆనందించే మనోనేత్రాలు యాంత్రికత ముసుగులో మూసుకుపోయాయి. శాశ్వత ఆనందానికి చిరునామా అయిన మానవుడు అలజడులు,అశాంతికి లోనై , వ్యతిరేక ఆలోచనా విధానం తో సతమవుతూ ఎన్నో రోగాలను ఏరి కోరి తెచ్చుకుంటున్నాడు. ఈ పరిస్థితి మారాలి. మానవాళి ఆలోచనా విధానం మారాలి. శాశ్వత, అశాశ్వత విషయల మధ్య వ్యత్యాసం గమమించగల వివేకం ఉదయించాలి. మన సనాతన మహర్షుల జీవన విధానాన్ని అలవర్చుకోవాలి. ఆచరణలో మిక్కిలి కష్ట సాధ్యమైనా ప్రయత్నించడం లో దోషమేమీ లేదు కదా ! ప్రశాంత చిత్తం తో జీవించడం, పరుగులు తీసే కోరికల గుర్రానికి కళ్ళెం వేయడం, మృదు భాషణం, సాత్వికమైన ఆహారాన్ని స్వీకరించడం, సద్గంధ పఠన, వీలైనంతగా నామ సంకీర్తన లేదా నామస్మరణ, పరులకు తమ శక్తి సామర్ధ్యాల సారం సహాయ సహకారాలను అందించడం, శక్తిని బట్టి దాన ధర్మాలను చేయడం ఇత్యాది సత్కార్యాలను విధిగా చేయాలి.ధ్యానం, యోగా వలన తామస, రజో గుణాలు నశించి సత్వ గుణం వృద్ధి చెందుతుంది. అప్పుడు క్రమేపీ అలోచనా స్థాయి దిగువ స్థాయి శక్తి కేంద్రాల నుంది వృద్ధి చెంది ఊర్ధ్వ కేంద్రాలకు పెరుగుతుంది. దు:ఖం, అశాంతి, అలజడి, మనో వికారాలు వాటి కవే మాయమౌతాయి. అప్పుడు శాశ్వతమైన, నిత్యమైన ఆనందానికి మానవుల జీవితం నెలవు అవుతుంది.

సర్వం శ్రీ శిరిడీ సాయి సమర్పయామి

వినయ విధేయతలే శ్రేయోదాయకం

వినయ విధేయతలే శ్రేయోదాయకం

మానవాళిని నేడు పట్టి పీడిస్తున్న దుర్గుణ భూతములలో అత్యంత ముఖ్యమైనది గర్వాహంకారములు. నేడు మానవాళికి ఎన్నడూ లభించని విధం గా భోగ భాగ్యాలు, సుఖ సౌఖ్యాలు లభిస్తున్నాయి. మొత్తం ప్రపంచాన్ని గురించి తెలుపగలిగే కంఫ్యూటర్లు వచ్చాయి. ధనార్జన విపరీతం గా పెరిగింది. జీవితం విలాసవంతం అయ్యింది. వాటితో పాటుగా గర్వాహంకారములు కూడా కొండంత పెరిగాయి. గోరంత తెలిసి వున్నా కొందంత తెలిసిందని విర్ర వీగడం, ఎదుటి వారిని చులకన చేసి మాట్లాడడం, అసభ్య, పరుష పదజాలం తో దూషించడం సర్వ సాధారణమైపోయింది. నేటి మానవాళిలో వినయ, విధేయతలు , వినమ్రత మచ్చుకైనా కానరావడం లేదు.


మనిషికి గర్వం ఎప్పుడూ పనికి రాదు. అణుకువ లోనే అందం వుంది. భగవంతుడు మెచ్చని దుర్గుణం గర్వం. కొందరు పరిస్థితులను గమనించక అన్ని వేళలా గర్వాహంకారములతో మిడిసిపడుతుంటారు. అందరినీ ఎదిరించగలమని దర్పాన్ని ప్రదర్శిస్తుంటారు. శత్రువులు బలం గా వున్నప్పుడు తనను తాను తగ్గించుకొని , తదనంతరం తలెత్తుకు తిరగడం వివేకపూరితమైన చర్య. జీవితం లో ఎదుతయ్యే కష్ట నష్టములు కూడా మనకు శత్రువులే.

ఈ సంధర్భం లో ఒక కధను స్మరించుకుందాం.

ఒక సారి సముద్రుడు తన భార్యలను పిలిచి “ నదులన్నీ తమ ప్రవాహం లో అడ్డుగా వున్న పెద్ద పెద్ద వృక్షాలను, బండలను దుంగలను ఒక ఉదుట్టున పెకిలించి తమతో పాటు తీసుకుపోతున్నాయి. కాని తమ ఒడ్డున వున్న అత్యంత అల్పమైన గడ్డి మొక్కను పెకిలించలేకపోతున్నాయి. ఎన్ని వరదలు వచ్చినా , నదులెంత ఉధృతం గా ప్రవహించినా గడ్డి మొక్క మాత్రం సుఖ జీవనం సాగించగలుగుతోంది. కారణం ఏమిటి ? "అని అడుగగా , సముద్రుని భార్య అయిన గంగాదేవి ముందుకు వచ్చి మిక్కిలి వినయ విధేయతలతో “ స్వామీ ! తాము ఉధృతం గా ప్రవహిస్తున్నప్పుడు మార్గం లో అడ్డుగా వుండే వృక్షాలను , బండ రాళ్ళను అవలీలగా పెకిలించి వేయడానికి కారణం ఆ వృక్షాలు, బండలు నదీ ప్రవాహాన్ని ఎదిరించ యత్నించడమే. అదే ఒడ్డున వుండే గడ్డి మొక్క ప్రవాహం వచ్చినప్పుడు అణిగి వుంటుంది. ఉధృతం తగ్గాక తిరిగి తలెత్తుకు నిలబడుతుంది. ఆ గడ్డి మొక్క యొక్క సమయోచిత ప్రవర్తనే దానిని అన్ని ఉపద్రవాలకు ఎదురు నిలవగలిగే శక్తిని ఇస్తోంది.” ఆని వివరించింది.

ఈ కధ మానవులకు అణుకువ, విధేయతల ఆవశ్యకత గూర్చి అద్భుతం గా తెలియజేస్తోంది. కష్ట నష్టాలు, ఆందోళనలు ప్రతీ వారి జీవితం లో తప్పని సరి. చీకటి వెనుకే వెలుగు, రాత్రి వెనుకే పగలు వలె కష్టం తర్వాత సుఖం రావడం తప్పని సరి. కష్టాలు వచ్చినప్పుడు గర్వాహంకారములతో ప్రవర్తించరాదు. ఆ కష్టాలను ఎదిరించి నిలనగలిగే శక్తి వున్న వారి విషయం వేరు. వాటిని ఎదిరించి, ఎదురెడ్డి నిలువలేని వారు తమ శక్తి సామర్ధ్యాలను గ్రహించుకొని, గర్వాహంకారాలను విడిచి పెట్టి, అణిగి మణిగి వుండగలిగితే ఎలా వచ్చిన కష్టం అలానే పోతుంది. తిరిగి జీవితం లో ఆనంద పరిమళాలు విరబూస్తాయి. అట్లా కాక తగినంత శక్తి సామర్ధ్యాలు లేకపోయినా కష్టాలకు, ప్రతికూల పరిస్థితులలో ఎదురు నిలిచితే వినాశనం ఖాయం.

ధుర్యోధనుడికి పాందవులను ఎదిరించగల శక్తి సామర్ధ్యాలు లేవు.అయినా గర్వాహంకారాల వలనే వారితో ఏరి కోరి శత్రుత్వం తెచ్చుకొని చివరకు దుర్భరమైన మరణం పొందాడు. రావణాసురునికి శ్రీ రాముని ఎదిరించగల శక్తి లవలేశమైనా లేదు. సీతాపహరణం గావించి, ఎందరు హితవు చెప్పినా పెడచెవిన పెట్టి, సీతను రామునికి అప్పగించక, ఏరి కోరి విరోధాన్ని తెచ్చుకొని , యుద్ధం లో బంధు మిత్ర, సపరివారాన్ని మొత్తం పోగొట్టుకొని చివరకు హతం అయ్యాడు. ఎదుటివారి గొప్పదనాన్ని తెలుసుకోకుండా అయిన దానికి, కానిదానికి అహంకారం తో విర్రవీగడం, ప్రతీవారు తన కంటే అల్పులని భావించి మిడిసిపడడం వినాశన కారి అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. వినయ విధేయతలు మనిషికి అందానిచ్చే ఆభరణాలు. అందుకే ఏమీలేని తాటాకు ఎగిరెగిరి పడ్తుంది, అన్నీ వడ్డించిన అరిటాకు అణిగి మణిగి వుంటుందని మన పెద్దలు చెబుతూ వుంటారు.

సర్వం శ్రీ శిరిడి సాయినాధార్పణ మస్తు

Tuesday, July 14, 2009

స్వధర్మాచరణ వైశిష్ట్యం

స్వధర్మాచరణ వైశిష్ట్యం

శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీతలో (కర్మ యోగం, 35 వ శ్లోకం) ఈ విధం గా ప్రవచించారు:

శ్రేయాన్ స్వధర్మ విగుణ : పరధర్మాత్స్వ నుష్టితాత్
స్వధర్మ నిధనం శ్రేయ: పరధర్మో భయావహ:

“ ఓ అర్జునా ! ఎంతో నైపుణ్యం తో ఆచరించే పరధర్మం కన్నా , గుణరహితం గా చేసినప్పటికీ స్వధర్మమే మేలు. స్వధర్మ నిర్వహాణార్ధం సమసిపోయినా మంచిదే కాని, అమరణాంత భయావహమైన పరధర్మానుష్టానం మాత్రం తగదు."

ఈ ప్రపం చం లో మానవులకు వారి వారి కుల, మత,ప్రాంతీయ దేశ కాలమాన పరిస్థితుల ధృష్ట్యా విధించబడిన కర్మలను చేయుట, ధర్మమును ఆచరించుట వారికే కాక యావత్ సమాజానికే ఎంతో శ్రేయస్కరం. జన్మత: ప్రాప్తించిన కర్తవ్యాలను నిర్వహించడమే స్వధర్మాచరణ.

మహాభారతం లో కురుక్షేత్ర యుద్ధం లో ప్రతిపక్షం లో తాతలు,తండ్రులు, సోదర సమానులు,గురుతుల్యులు, వున్న కారణం గా అర్జునుడు మాయామోహం లో పడి మనస్థాపం చెంది విల్లును క్రింద పడవైచి యుద్ధం చేయలేనని అశక్తత వెల్లడించినప్పుడు శ్రీ కృష్ణ భగవానుడు స్వధర్మాచరణ గూర్చి అత్యద్భుతం గా బోధ చేసారు. : దేశ ప్రజల రక్షణ కోసం, అధర్మాన్ని శిక్షించేందుకు , ధర్మ పరిరక్షణ గావించేందుకు యుద్ధం చేయుట క్షత్రియ ధర్మం. ఈ ధర్మచరణ లో అసువులు బాసినప్పటికీ వీరస్వర్గమే ప్రాప్తిస్తుంది. అట్లు కాక వెన్ను చూపి పలాయనం చిత్తగిస్తే స్వధర్మాచరణ గావించని కారణం గా రౌద్రవాది నరకములు ప్రాప్తిస్తాయి. కావున నీ క్షత్రియ ధర్మమును నెరవేర్చు” అని అర్జునుడికి హితబోధ చేసి కర్తవ్యన్ముఖుడిని గావించారు. పై ఉదంతాన్ని బట్టి స్వధర్మాచరణకు తమకు విధించిన కర్తవ్య నిర్వహణకు శ్రీ కృష్ణ భగవానుడు విశిష్ట స్థానం కల్పించారు.

స్వధర్మమనగా మనకు విధింపబడిన కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని ప్రతీ ఒక్కరు సక్రమంగా నిర్వహించడం వలన వ్యక్తిగతం గానే కాక సమాజ పరం గా కూడా శ్రేయస్సు ఒనగూరుతుంది.

పాలకులు నిష్పక్షపాతం గా తమ కర్తవ్యాన్ని నెరవేరుస్తూ, బంధుప్రీతికి, అవినీతికి తావ్వివక నిరంతరం తావివ్వక నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పాటుపడితే దేశం అత్యున్నతం గా పురోగమిస్తుంది. ఉపాధ్యాయులు అకుంఠిత దీక్షతో , నిస్వార్ధం గా పాఠ్య బోధన గావిస్తూ విధ్యార్ధులలో క్రమశిక్షణ నెలకొల్పేందుకు కృషి చేయాలి. మత ప్రచారకులు , గురువులు సంకుచిత బుద్ధిని విడనాడి ధర్మాధర్మముల మధ్య వ్యత్యాసాన్ని , ధర్మాచరణ యొక్క వైశిష్ట్యాన్ని ప్రజలకు తెలియజేసే కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వహించాలి. రైతులు వ్యవసాయాన్ని,వ్యాపారులు ఎక్కువ లాభాలకు ఆశ పడక ప్రజలకు ధర్మ బద్ధంగా తక్కువ ధరలకే వస్తువులను విక్రయించడం, కార్మీకులు క్రమశిక్షణతో నాణ్యమైన వస్తువుల ఉత్పత్తికి కృషి చేయడం,పోలీసులు అవినీతికి తావ్వివక అక్రమార్కులను శిక్షించడం, శాంతి భద్రతలను కాపాడేందుకు చిత్త శుద్ధితో కృషి చేయడం –ఇలా ప్రతీ ఒక్కరు తమకు నిర్దేశింపబడిన కర్తవ్యాన్ని క్రమశిక్షణతో నిర్వర్తిస్తే మన సమాజం లో అన్ని అసమానతలు తొలిగి పురోగమిస్తుంది.గాంధీ మహాత్ముడు కలలు గన్న రామరాజ్య స్థాపన సాధ్యం.

గుణరహితమైనా ,కష్ట సాధ్యమైనా స్వధర్మాచరణయే అన్నింటి కంటే మేలైనది. పర ధర్మాచరణ మానవుని వినాశనానికి దారి తీస్తుంది. సమాజం లో అశాంతి, అలజడులు, అసమానతలు నెలకొనడం ఖాయం. జన్మత: ,వృత్తి వలన ప్రాప్తించిన స్వధర్మాన్ని విడవడం, పరధర్మాన్ని ఆచరించడం ఎంత మాత్రం తగదు. స్వధర్మం ఆచరించిన ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి మొదలైన వారు చరిత్రలో విశిష్ట స్థానం సంపాదించుకున్నారు. మాకు ఒక మతం వలన మేలు కావడం లేదని ఇతర మతములను ఆశ్రయించేవారు ఈ విషయం లో సక్రమం గా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. జన్మత: సంక్రమించిన మతం పితృ సమానం. జన్మ నిచ్చిన తండ్రిని మార్చడం ఎంత పాపభూయిష్టమో మత మర్పిడి కూడా అంతే. దాని వలన బ్రహ్మ హత్యా పాతకం వంటి భయం కరమైన దోషాలు సంక్రమించడం తో పాటు రౌద్రవాది నరకముల ప్రాప్తి తప్పదు. అందుకే స్వధర్మాచరణే మిక్కిలి శ్రేష్టం

సర్వం శ్రీ శిరిడీ సాయినాధార్పణ మస్తు

Monday, July 6, 2009

కవితా సమాహారం - 20

సహవాసం

ఏవరి పిచ్చి వారికానందం
తానే తెలివైనవాడినని ఇతరులందరూ అధములని
భావించు వారు అధమాధములు
మనసుకు, వ్యక్తిత్వానికి ముసుగులు ధరించి
మేక పోతు గాంభీర్యం
ప్రదర్శించుట అవివేకం
దిగువ స్థాయి శక్తి కేంద్రముల నుండి
ఆలోచనలు చేయుట
తదనుగుణముగా కార్యములను చేపట్టుట
నైతిక పతనానికి నిదర్శనం
నిత్యం భావోద్వాగాలతో సహవాసం
మన దుఖములకు మూల కారణం

కార్పరేట్ ఆసుపత్రులు

ఇదేం ఆసుపత్రి నాయనోయ్
డబ్బుతో, డబ్బుకొరకు
డబ్బు మదం తో వైద్యమందించే
కార్పొరేటు ఆసుపత్రులు ప్రజల పాలిటి
నరక కూపాలు,వ్యాపార కేంద్రాలు
డబ్బిస్తేనే నాడి చూడడానికి సంసిద్ధం
ప్రాణాలు పోతున్నా డబ్బు వాసన పడనిదే
కదలికలు రాని డాక్టర్ బాబులు
వారినే నమ్ముకొని వున్న పరీక్షకులకు
అను నిత్యం పండగే
అన్ని రకాల అవసరం లేని టెస్టులను చేయించి
జలగల వలె డబ్బు గుంజే వైనం బాధాకరం
అడ్డగోలుగా ధన దోపిడీ జరుగుతున్నా
నిమ్మకు నీరెత్తనట్లు మిన్నకుండే అధికారులు
పేదవారికి నాణ్యమైన వైద్యం
ఎప్పటికీ నిజం కాని సుదూర స్వప్నం

Wednesday, June 3, 2009

కవితా సమాహారం-19

మానవ జీవితమునకు సార్ధకత

ఆతి విలువైన మానవ జన్మకు సార్ధకత
సాధించుట అత్యావశ్యకం
సనాతన మహర్షుల , మహాత్ముల
జీవన విధానమే మనకు ప్రమాణం
పావురాయి కోసం దేహార్పణ గావించిన బలి
రాక్షస వినాశనార్ధం తపశ్సక్తితో
దేహపుటెముకలను వజ్రాయుధం కొరకు
అమరేంద్రునకు అర్పించిన దధీచి
సత్య జీవనం కొరకు
భార్యా బిడ్డలనమ్ముకొని కటిక దరిద్రం
అనుభవించిన హరిశ్చంద్రుడు
యావత్ జీవితం మృదుభాషణం, సత్యవాక్కు కోసమే
వెచ్చించిన ధర్మరాజు
కరుణతో ప్రపంచమును జయించిన జీసస్
మహమద్ ప్రవక్తలు మనకాదర్శం
వారు జూపిన జీవన మార్గములో
సూటిగా సాగిపోవుటయే మన కర్తవ్యం

దాన గుణం

అన్ని ప్రధాన ధర్మములలో దానగునమే మిన్న
నిత్యం మనకు లభించే ధనం
మన కొరకే కాక పరులకు పంచే
భాగ్యం కల్పించిన భగవంతునికి వందనం
అన్నదానము,వస్త్ర దానము, మాట దానము
తప్పక ఆచరించవల్సిన కర్మలు
ధన దానమునకు పాత్రత అత్యావశ్యకం
ధనము పరులను సోమరులను
చేయరాదన్నదే నిబంధన
అస్సహాయులను, దీన జన బాంధవులను
అన్నార్తులను ఆదుకొనుటయే మన కర్తవ్యం
కష్ట, నష్టములలో, కన్నీళ్ళ కడలిలో వున్నవారిని
రోగపీడితులకు స్వలాభపేక్ష లేక
ఆదుకొను వారికి శ్రిహరి ఆశ్వీర్వవచనములు లభ్యం

మహాత్ముల లక్షణములు

జ్ఞానం, క్షమ, జాలి, కరుణ,ప్రేమ
ఇంద్రియ నిగ్రహం,సత్య వాక్కు, దానం
ఇత్యాది సద్గుణములు గలిగినవారందరూ
పరమాత్మ స్వరూపులే
అట్టి వారి హృదయములయందు
ఆ సర్వేశ్వరుడు సదా కొలువైవుండును
ఈ జనన మరణ చక్రభ్రమణం నుండి
విడిపడి మోక్షమును పొందెదరు
సామాన్య మైన జీవితం గడుపుతూ
రవ్వంత ఉనికి కూడా లేని
మనవంటి వారందరికీ
అట్టి దివ్యత్వం సాధించుట సాధ్యమే
కఠోర శ్రమ, తపన
లక్ష్యం, ప్రణాళిక ద్వారా
మహనీయత్వం సాధించుట సాధ్యం

Monday, June 1, 2009

కవితా సమాహారం - 18

దాన ధర్మములు

అదాన దోషేణ భవే దరిద్ర:
దాన ధర్మములు ఒనరించక
మానవులకు మరు జన్మలో దరిద్రులుగా
జన్మ నెత్తడం ఖాయం
న్యాయ పరమైన సంపాదనలో
తృణమో, పణమో లేనివారికి
దనమిచ్చుట అత్యావశ్యకం
తన కొక ఉనికి కల్పించి
ఎదుగుదలకు పునాది కల్పించిన
సమాజమునకు చేయూత నందించుట
ఋణము తీర్చుకొనుట అవశ్యం
శ్రద్ధతో, నిశ్చయం తొ
నిస్వార్ధ బుద్ధితో దానమిచ్చు
గుణం అలవరచుకోవలెను
ఇవ్వని వారికి భవిష్యత్తులో
ఇవ్వబడదు అన్నది శాస్త్ర ఉవాచ
ప్రేమతో, కరుణతో, జాలితో
ప్రతిఫలాపేక్ష ఆశించక ఇచ్చువారికి
భగవంతుని అపూర్వ
కరుణా కటాక్షములు శ్రీఘ్రమే లభించును

దాన గుణమే శ్రేష్టం

దాన గుణం తోనే మనవుడు అగును ధర్మాత్ముడు
ఇతరులకు ఆదర్శవంతుడు,భగవత్స్వరూపుడు
సమాజ హితమును కాంక్షిస్తూ
చిత్త శుద్ధితో కృషి సల్పుతూ
ఉత్తమ విలివలకు ఆలంబనౌతాడు
దానం చేయుట హస్తమునకు భూషనం
గొప్ప సౌశీల్యం
తన కొరకు కాక ఇతరులకు
ధనమును ఖర్చు చేయుట
మహాత్ముల లక్షణం
అపాత్ర దానం కూడదు
మానవ జీవితం దాన ధర్మములతోనే
ముడిపడి వుందన్నది గొప్ప సయం
సద్గతికి మార్గము
ఉత్తమ జీవితమునకు నాంది
దాన గుణముతో చరిత్ర కెక్కిన
కర్ణుడు, బలి చక్రవర్తి మనకు ఆదర్సం
పిసినారితనం అతి ప్రమాదకరమైన వ్యాధి
మానవులను అధమ: పాతాళానికి తొక్కి వేయును
జీవితం క్షణ భంగురమని గుర్తించి
దాన ధర్మములను విశేషముగా
ఒనరించుట మన తక్షణ కర్తవ్యం

Saturday, May 23, 2009

కవితా సమాహారం - 17

ఆలౌకిక ప్రేమ

ఆన్ని ప్రేమల కంటే అలౌకిక ప్రేమ దివ్యమైనది
నిస్వార్ధము, దయపూరితము
బేధ భావము లేనిదియు
దివ్యత్వమును సంతరించుకున్నది
భగవంతుని సన్నిధికి చేర్చునది
సకల జీవులతో ఆత్మానుసంధానము చేయునది
ఇంతింతై వటుడింతై అను రీతిన
దిన దిన ప్రవర్ధమానము చెంది
ప్రాపంచిక విషయములయందు
విముఖత భావం ఏర్పరిచి
మానవులను మహనీయత్వము వైపుకు
మోక్ష మార్గమందు నడిపించి గమ్యమునకు
అవలీలగా చేర్చునది అలౌకిక ప్రేమ
అలౌకిక ప్రేమ సాధించుటకు
భగవంతుని యందు భక్తి, తపన
మధుర హృదయము అత్యావశ్యకం


దురాశ

అత్యాశ,స్వార్ధ చింతన అన్ని
వ్యాధుల కంటే అతి ప్రమాదకరము
సృష్టిలో అన్నియూ తనకే చెందవలెనన్న
స్వార్ధ చింతనతో జీవించే
మానవుల హృదయములు దురాశాపూరితం
సర్వ జీవరాశులకు ప్రకృతి ఫలములు
సమనముగా లభింపవలెనన్న
ఒక్కరి కొరకు అందరరం
అందరం కొరకు ఒక్కరం అను
సృష్టి ధర్మములను మరిచి
అధర్మముగా, అన్యాక్రాంతముగా
సర్వం చేజిక్కించుకోవలెనన్న
మానవుల దురాశ దుఖమునకు చేటు
చివరకు ప్రకృతి మాత ఆగ్రహమునకు
గురి కావడం తధ్యం

కవితా సమాహారం - 16

ఆలౌకిక ప్రేమ

ఆన్ని ప్రేమల కంటే అలౌకిక ప్రేమ దివ్యమైనది
నిస్వార్ధము, దయపూరితము
బేధ భావము లేనిదియు
దివ్యత్వమును సంతరించుకున్నది
భగవంతుని సన్నిధికి చేర్చునది
సకల జీవులతో ఆత్మానుసంధానము చేయునది
ఇంతింతై వటుడింతై అను రీతిన
దిన దిన ప్రవర్ధమానము చెంది
ప్రాపంచిక విషయములయందు
విముఖత భావం ఏర్పరిచి
మానవులను మహనీయత్వము వైపుకు
మోక్ష మార్గమందు నడిపించి గమ్యమునకు
అవలీలగా చేర్చునది అలౌకిక ప్రేమ
అలౌకిక ప్రేమ సాధించుటకు
భగవంతుని యందు భక్తి, తపన
మధుర హృదయము అత్యావశ్యకం


దురాశ

అత్యాశ,స్వార్ధ చింతన అన్ని
వ్యాధుల కంటే అతి ప్రమాదకరము
సృష్టిలో అన్నియూ తనకే చెందవలెనన్న
స్వార్ధ చింతనతో జీవించే
మానవుల హృదయములు దురాశాపూరితం
సర్వ జీవరాశులకు ప్రకృతి ఫలములు
సమనముగా లభింపవలెనన్న
ఒక్కరి కొరకు అందరరం
అందరం కొరకు ఒక్కరం అను
సృష్టి ధర్మములను మరిచి
అధర్మముగా, అన్యాక్రాంతముగా
సర్వం చేజిక్కించుకోవలెనన్న
మానవుల దురాశ దుఖమునకు చేటు
చివరకు ప్రకృతి మాత ఆగ్రహమునకు
గురి కావడం తధ్యం

Friday, May 22, 2009

కవితా సమాహారం - 15

సమ సమాజ స్థాపన

ద్వేషమును పోగొట్టు గొప్ప ఔషధం ప్రేమ
స్వార్ధ చింతనకు తావివక
సర్వం త్యాగమొనర్చి
తన కొరకు కాక
తన కంటె దురదృష్టవంతులు
ఈ సృష్టి యందు గలరని గ్రహించి
పరుల కొరకు జీవిస్తూ
వారి హితమును కాంక్షిస్తూ
అందుకై చిత్త శుద్ధిగా కృషి సల్పుతూ
సమసమాజ స్థాపన కొరకు
తన వంతు చేయినందించి
ముందుకు సాగు వారు మహాత్ములు

ప్రేమ .. ప్రేమ.. ప్రేమ

ఈ సృష్టికి మూలం ప్రేమ
ప్రేమను మించిన పవిత్ర వస్తువు
ప్రేమకు సరి తూగగల శక్తి లేవు
నిస్వార్ధ ప్రేమ పునాదులపై
నిర్మింపబడ్డ ప్రపంచం శక్తివంతం
కుల,మత, వర్గ బేధములకు
అతీతముగా హృదయములయందు జనించెడి
అపురూప,అసామాన్య భావన ప్రేమ
అలౌకిక ప్రేమకున్న మహత్తు అనిర్వచనీయం
అన్ని రోగముల కంటే ప్రేమ రాహిత్యం ప్రమాదం
ప్రేమించలేని,ప్రేమింపబడని
వారి జీవితం కడు వ్యర్ధం

Thursday, May 21, 2009

కవితా సమాహారం - 14

ఆత్మ సౌందర్యం

బాహ్య చక్షువులతో ,కోరికల నిషాతో
భౌతిక సౌందర్యమును ఆస్వాదించువారు అధములు
మనో నేత్రములతో అంతర్ సౌందర్యమును
వీక్షించువారు దయామయులు,మహాత్ములు
అద్భుత, అపురూపమైన శిల్పి యగు
సర్వేశ్వరుని సృష్టిలో అందవిహీనమైదని ఏది ?
జడత్వం నిండిన వస్తువులయందు సైతం
ఆత్మ సౌందర్యం నిండి వున్నది
వీక్షించు వ్యక్తుల దృష్టి లోనే
సౌందర్యం అంతరం
పరిశుద్ధమైన ప్రేమతో
సౌందర్య భరితమైన
హృదయములే సర్వేశ్వరుని ఆలయములు

పరుల సేవ

పరిశుద్ధమైన , కరుణాపూరితమైన
సేవా తత్పరత భావముతో , దైవ ప్రేమతో
కర్మ యోగ భావన గల
హృదయం భగవంతుని ప్రేమాలయములు
పరుల సేవయే పరమోత్కష్టం గా భావించి
అద్యంతం జీవించిన గాంధీ జీ మనకాదర్శం
వృత్తి ధర్మమును సత్య మార్గములో
తపము వలె ఆచరించు వారందరూ మహాత్ములే
నిష్కామ, నిస్వార్ధ సేవ వలన
దుష్కృతి లేని మహా పాపములన్నీ మటుమాయం

కవితా రచన : సాయి ఋత్విక్

Sunday, April 5, 2009

కవితా సమాహారం - 13

శ్రీ సాయి లీలావైభవం

నిర్గుణులు, నిరాకారులు, పరబ్రహ్మ స్వరూపులు
స్వప్రకాశకులు, భక్తులను సదా బ్రోచెడి
శ్రీ శిరిడీ సాయినాధులకు వందనం
ఆడంబరమైన పూజలు,యజ్ఞాలు
అట్టహాసముగా చేయు జప, వ్రతములు వలదని
హృదయశుద్ధితో ఒనర్చు సాయి సాయి అను
నామజపమే చాలుననియు
తలచిన తక్షణమే బ్రోచెదనని
వాగ్దానమొనర్చిన దయాళువు
జీవిత నౌకకు సరంగుగా చేసుకొనిన
సర్వమూ తానై నడిపే సమర్ధ సద్గురువు
నమ్మిన వారిని నట్టేట ముంచనని వాగ్దానము సల్పి
సర్వస్య శరణాగతి ఒనరించిన
భక్త జనావళికి తోడూ నీడై నిలిచి
చివరి కంటా గమ్యం చేర్చే దీన బంధువు
భక్తుల పాలిటి కల్పవృక్షము
భక్త జన వంద్యుడు శ్రీ సాయినాధుడు


గురుస్తుతి

నామ, రూపములు లేని హృదయజ్యోతి
బ్రహ్మ తేజం, నిరాకార పరబ్రహ్మం
సమిష్టి విరాట్ పురుషుడు
యద్భావం తద్భవతి రీతిన
విభిన్న భక్తులకు విభిన్న రూపములలో
దర్శన మిచ్చి కోరిన వరములనిచ్చిన పరబ్రహ్మం
సకల జీవులయందు సదా కొలువై వుండెడి
నిరాకార జ్యోతి స్వరూపం శ్రీ సాయినాదుడు
శాశ్వత ఆత్మ అమృత స్వరూపం
గోచరించే విశ్వమంతా నిండి వున్న ఆత్మ శక్తి
ప్రకాశైక స్వరూపుడు, అయోనిజ సంభవుడు
పరమ పవిత్రుడు, త్రిగుణాతీతుడు
విశుద్ధ విజ్ఞాన స్వరూపుడు
శాశ్వతమగు పరమానందములో
సదా ప్రకాశించెడి శుద్ధ చైతన్య స్వరూపుడు
భక్తజన వంద్యుడు సమర్ధ సద్గురువు శ్రీ సాయి

Tuesday, February 10, 2009

కవితా సమాహారం - 12


ఆన్న దానం

ఆన్ని దానములలో కెల్లా అన్న దానం శ్రేష్టం
ఆకలి బాధతో తాళలాడేవారికి పిడికెడు
అన్నం ఇచ్చి క్షుద్భాధ ను తగ్గించిన
అన్ని సత్కర్మల కంటే శ్రేష్టమైనది
అన్న దానం వివేకంతో చేయదగిన అద్భుతమైన
అతి పవిత్రమైన సత్కార్యం
తద్వారా అపారమైన పుణ్యం లభ్యం
ఉత్తమ గతులు ప్రాప్తి తధ్యం
పాత్రత నెరిగి అన్న దానం చేయుట తప్పనిసరి
చేసిన వారికి సద్గతి , పాపహరణం,
స్వీకరించిన వారికి తృప్తి
కలుగవలెనన్న వేద ధర్మం విస్మరించరాదు
అన్న దానం పేరిట సోమరులను పోషించుట తగదు
మంచి చెడుల నాలోచించి , వివేకంతో వ్యవహరించి
అన్న దానం చేయుట అన్ని పాపాలకు నిష్కృతి


దేహమే దేవాలయం

హృదయం కు మించిన దేవాలయం లేదు
నిర్మలమైన అంత కరణములతో
పరిశుద్ధమైన మనసుతో
అరి షడ్వర్గములను లోబరుచుకొని
సుఖ దుఖములను సమానంగా
స్వీకరించగల సమ దృష్టిని సాధించి
ఈశ్వరేచ్చ లేనిదే చిగురుటాకైననూ కదలదన్న
వివేకమును సాధించి
లభించునంతయూ భగవంతుని అనుగ్రహమేనన్న
ప్రసాద భావంతో జీవిస్తూ
పరుల హితాన్ని మనస్పూర్తిగా కాంక్షిస్తూ
సర్వ మానవ సౌభ్రాతృత్వం, సర్వ జీవ సమానత్వం
నిత్య జీవితం లో అభ్యాసమొనరిస్తూ
శాంతియుత జీవనం సాగించువారి హృదయములలో
భగవంతుడు సదా కొలువై వుండును
అట్టి వారికి ఆలయ దర్శనం ఆవశ్యకత లేదు

Monday, February 9, 2009

కవితా సమాహారం - 11

అంత శుద్ధి

ఛిత్త శుద్ధ్జి లేని శివ పూజ లేలరా ?
కోపం, ద్వేషం నశించనిదే
ఎన్ని శాస్త్రములను అధ్యయనం చేసిననూ ప్రయోజనం శూన్యం
అసూయ తొలగనిదే, హృదయం పరిశుద్ధం కానిదే
ఎన్ని జప తపస్సులను ఒనరించిననూ ఫలితం శూన్యం
ఆడంబరమూ కోసం బాహ్యోపాటంగా
చేసెడు యజ్ఞములు సైతం ఫలించవు
కామ క్రోధాధి దుర్గుణములకు దూరం గా జీవిస్తూ
నితం సత్యం తో సహజీవనం చేస్తూ
పుష్పం, నీరు సమర్పించిననూ
భగవంతుడు ప్రీతికరం చెందుట తధ్యం
అంత శుద్ధిని సాధించి
సత్యమైన సర్వోత్తమునిగా
జీవించుటయే మన లక్ష్యం కావాలి !


శ్రీ కట్న లీలలు

లక్షలకు లక్షలు మార్కెట్లో రేటు పలికినప్పుడు
మగమహారాజునని గర్వ పడ్డాను
ఎక్కువ రేటు ఇచ్చిన వారికి తల వంచి
ఆమె మెడలో తాళి కట్టాను
అప్పట్నుంచి ఓడలు బళ్ళయినట్లు
నా జీవితం తలకిందులై పోయింది
డబ్బిచ్చి కొనుక్కునందుకు
పెత్తనం చెలాయించింది
ఆఫీసులో పులిలా బాసునైన నేను
ఇంట్లో పిల్లినై పోయి ఆమె పాదాలకు
దాసోహం అనవల్సి వచ్చింది
ఆడ బాసు ఎదురుగా నోరు మెదపని స్థితి
అన్నింటికీ తందాన తానాయే నా పాట
గాడిద చాకిరీ చేస్తూ కట్నం గా తీసుకున్న
ప్రతీ పైసాకు చెమట నోడ్చే బ్రతుకు
కను చూపు మేరలోనికి రాలేని నా తల్లిదండ్రులు
తిరగబడదామంటే గృహ హింస చట్టం క్రింద
నేరం మోపించి కటకటాల వెనక్కి
నెట్టిస్తానని బెదిరింపులు
కట్న మాశించి నన్ను అమ్ముడుపోయినందుకు
తగిన శాస్తే జరిగిందని మురిసిపోతున్న అత్తవారు
ఏం చెయ్యనురోయ్ దేవుడా ?
నా జీవితం అందరికీ గుణపాఠం

Sunday, February 8, 2009

కవితా సమాహారం - 10

దురాశ

దురాశ దు:ఖానికి హేతువు
కష్టానికి తగు ఫలిత మాశించక
అధికమైన కోరికలతో పరుగులు
తీయువారి జీవితం నిత్యం అశాంతిమయం
చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా !
ప్రయత్న సిద్ధి పైనే ఫలితం ఆధారం
అందనిది, అలవి కాని ఫలాన్ని అందుకోవాలని
యత్నించిన తప్పదు భంగపాటు
దురాశా రాహిత్యాన్ని అలవర్చుకొని
స్పష్టమైన లక్ష్య సాధనతో
చిత్త శుద్ధితో ప్రయత్నం గావించి
తుది ఫలితాన్ని భగవదార్పణ గావించి
ముందడుగు వేసిన వారే విజయ శిఖరాలను
అతి సులభం గా అధిరోహించగలరు

తృష్ణా రాహిత్యం

తృష్ణా రాహిత్య మనే సద్భుద్ధిని అలవరచుకొని
దురాశ, అత్యాశలను త్యజించి
అమూల్యమైన జీవితాన్ని శాంతిమయం
చేసుకోమన్న శంకర భగత్పాదుల
దివ్యోపదేశం మనకు సదా అనుసరణీయం
పేరాశకు పోయిన జీవితం దుఖ భాజనమగును
ఏది లభించినూ భగవంతుని అనుగ్రహమన్న
దివ్య భావనతో, సంతృప్తితో జీవించువారి
హృదయం సదా శాంతిమయం
కష్టాళ్ళు, కన్నీళ్ళు, అశాంతి కడు దూరం
నిరంతరం అతి వేగంతో పరుగులు తీసే
కోరికల గుర్రానికి కళ్ళెం వేసి
మనస్సును తపస్సుతో నిగ్రహించి
సంతృప్తితో దురాశకు లోను కాక
నిరంతర కృషితో జీవితమును
గడపడమే వివేకవంతుల లక్షణం

Saturday, January 3, 2009

కవితా సమాహారం 9

అత్యాచారాలు

నేల రాలిన మరొక ధృవ తార
స్వప్నిక అనంత లోకాలకు పయనం
మానవుడు చంద్రయానం చేయు
ప్రస్తుత వైజ్ఞానిక విప్లవ కాలం లో
కలియుగ దుశ్శాసనుల అమానుష
పైశాచిక రాక్షస క్రీడకు
మరొక అభాగ్యురాలు బలి
సభ్య సమాజం సిగ్గుతో
తలవంచుకోవాల్సిన స్థితి
ఆధునికత ముసుగులో
అహంకారం మదించిన పురుష పుంగవుల
అమానుష , రాక్షస కృత్యాలకు
ముగింపు ఎన్నడో ?
అభాగినులకు రక్షణ కరువు
పస లేని చట్టాలు
చోద్యం చూస్తున్న యంత్రాంగం
ఓ మానవత్వమా ! ఇకనైనా మేలుకో


భూత దయ

ఏకో దేవ : సర్వ భూతేషు గూఢ : అన్నది ఆర్యోక్తి
సకల వేద సారం భూత దయ
అందరిలో ప్రజ్వరిల్లేది ఒకే పరబ్రహ్మం
సర్వుల పట్ల మైత్రీ భావం
నశీంచును మదిలో భేధ భావం
మనసు అగును కరుణా సముద్రం
పరులను మన వలె చూడగలగడం
నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న
ఏసు ప్రభువు బోధలు కావాలి మనకు ఆదర్శం
అలవర్చుకున్నచో సహనం
సమరస భావం, సర్వ జీవ సమానత్వం
మానవుడు అగును మహనీయుడు

కర్మ సిద్ధాంతం

కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన
మన కష్ట నష్టాలకు మన దుష్కర్మలే కారణం
రేపటి అందమైన జీవితం కొరకు
నేడు సత్కర్మల నాచరించుట అత్యావశ్యకం
క్రియకు ప్రతి క్రియ ఎల్లప్పుడూ సమానమే
మంచి భవిష్యత్తు కొరకు ధర్మాన్నే కాంక్షిస్తూ
ధర్మాన్నే ఆచరించడం శ్రేయస్కరం
మనల్ని ఎల్లవేళలా వెంటబెట్టుకొని వుండి
సర్వా కాల సర్వావస్థలయందు
రక్షించునది ధర్మం మాత్రమే
సత్కర్మలనే విత్తనములను నేడు నాటిన
అష్టైశ్వర్యములు, నిత్య, శాశ్వత ఆనందములతో కూడిన
బంగారు పూదోట వంటి భవిష్యత్తు
పంట రేపు మనకందడం తధ్యం
ఈ సత్యాన్ని మదిలో పదిలపరచుకొని
అనుక్షణం ఆచరించడం అత్యున్నత సాధన

Thursday, January 1, 2009

కవితా సమాహారం – 8

సాయి ఆరాధన

ప్రాత: కాలమందే పవిత్ర హృదయులై
సాయి ఆరాధనను గావించుట సర్వ శ్రేష్టం
నాలుగు కాలములయందు సాయి హారతులను
భక్తితో, త్రికరణ శుద్ధితో పాడుట గొప్ప సాధన
అన్ని పాపములను, మానసిక వ్యధలను
దూరం చేయు సంజీవని ఔషధం
సర్వ మానవ సౌభ్రాతృత్వం,
సర్వ మత సమానత్వం
త్రికరణ శుద్ధిగా దీన జనోద్ధారణ
నిత్య సాయి నామస్మరణ మన సాధన కావాలి
సాయి పలుకులే వేద , ధర్మ శాస్త్రములు
సాయినామమే వేద మంత్రములు
సాయిని మనసా వాచా నమ్మి కొలిచెడి
భక్త జనావళికి భక్తి,ముక్తి కరతమలాకములు


శ్రీ సాయి లీలావైభవం 1

సాయి దివ్య నామం పరమ పుణ్య ధామం
అదియే మోక్ష తీరం ,వేద సారం
తన నాశ్రయించిన వారికి
అలవోక దృష్టి ప్రసాద
మాత్రం చేతనే అష్టైశ్వర్యాలను
ప్రసాదించే రాజాధిరాజు
అను నిత్యం భిక్షాటన ద్వారా
తన భక్తుల పాపములను స్వీకరించి
వారిని పాప విముక్తులను చేసి,
సన్మార్గ వర్తులను గావించి
తుదకు ముక్తిని ప్రసాదించే దయామయుడు
ఎందరో వ్యంధ్య స్త్రీలు శ్రీ సాయి
దర్శన, స్పర్శ మాత్రమునే సత్సంతానవంతులైన
తీరు బహు అపురూపం అద్వితీయం
తనను త్రికరణ శుద్ధిగా నమ్మి కొలిచెడి వారికి
ఏనాడూ అన్న వస్త్రాదులకు లోటు రానివని దయమూర్తి
దీనుల పాలిటి దయా సముద్రులు
ఆశ్రితులకు అన్నపూర్ణావిభువులు శ్రీ సాయి
శ్రీ సాయి పాదములే మనకు శరణ్యం
శ్రీ సాయి నామమే మనకు సుస్వర వేద మంత్రములు


శ్రీ సాయి లీలావైభవం 2

సాయి దివ్య నామం పరమ పుణ్య ధామమం
అదియే మోక్ష తీరం వేద సారం
సర్వ దేవతా మూర్తి, పరమాత్మ స్వరూపుడు
అద్యంత రహితుడు, దీనుల పాలిటి కామధేనువు
దీనార్తులు, ఆశ్రితుల పాలిటి కల్పవృక్షం
సాయి పవిత్ర చరణముల నాశ్రయించిన వారికి
ఎల్ల వేళలా రక్షణ కవచమందించి
కంటికి రెప్పలా కాపాడే దేవదేవుడు
భక్తుల హృదయములలో పేరుకొని పోయి వున్న
అజ్ఞానంధకారములను పటాపంచలు చేసి
జ్ఞాన జ్యోతులను వెలిగించి
సన్మార్గ వర్తులను గావించి
ముక్తి మార్గములో పయనింపజేయు సద్గురువు
శ్రీ సాయిని మనసా వాచా నమ్మి
త్రికరణ శుద్ధిగా కొలిచిన వారికి
కష్టము, నష్టములు, కన్నీళ్ళు
చింతనలు, సమస్యలు, వ్యధలు కడు దూరం
నిత్య, శాశ్వత పరమానందం ప్రాప్తం.